Nellore: ఆ మర్డర్ వెనుక ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా.. సంచలన కేసులో పోలీసుల కీలక అడుగు..
నెల్లూరు అడవుల్లో కలకలం రేపిన మర్డర్లో కూపీ లాగితే క్లూ చిక్కింది. చంపిందెవరో? ఎందుకు చంపారో? ఒక అంచనాకి వచ్చారు పోలీసులు. ఇంతకీ, వాళ్లెవరు? ఎందుకు చంపారు?
నెల్లూరు జిల్లా కలువాయి అటవీ ప్రాంతంలో సంచలనం రేపిన మర్డర్ వెనక అసలు గుట్టును పోలీసులు కనిపెట్టారు. కాళ్లూ చేతులు నరికేసి అత్యంత దారుణంగా హత్య చేయడం వెనక ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. హత్యకు గురైన చంద్రను ఎర్రచందనం స్మగ్లర్లకు కొరియర్గా పోలీసులు ఐడెంటిఫై చేశారు. స్మగ్లర్లకు సహకరించడం, ఎర్రచందనం దుంగలను సీక్రెట్ ప్లేస్కి తరలించడం, కూలీలకు ఫుడ్ సప్లై చేయడం చంద్ర పని. అయితే, ఎప్పటిలాగే కూలీలకు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్తుండగా చంద్ర హత్య జరిగింది. చంద్ర హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని పోలీసులు గుర్తించారు.
ఎర్రచందనం దుంగలను రహస్య ప్రదేశానికి తరలించడం, ఫుడ్ సప్లై చేయడానికి ఒప్పందం చేసుకున్న చంద్ర… ఆ తర్వాత రెడ్శాండిల్ ఆచూకీ చెప్పకపోవడంతోనే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. చంద్ర మర్డర్ స్పాట్కు సమీపంలోనే పొదల్లో ఎర్రచందనం డంప్ దొరకడంతో ఈ అంచనాకి వచ్చారు. చంద్ర ఫోన్ కాంటాక్ట్లోని నెంబర్స్ ఆధారంగా పోలీసులు తమిళనాడుకి చెందిన కొందరు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వీళ్లందరినీ సీక్రెట్ ప్లేస్కి తరలించి ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ కేసులో నిజానిజాలేంటో క్లియర్ పిక్చర్ రేపోమాపో తేలిపోనుంది. ఇవన్నీ పక్కనబెడితే, నెల్లూరు జిల్లాలో మళ్లీ ఎర్రచందనం మాఫియా ఆగడాలు బయటపడటంతో భయంతో స్థానికులు వణికిపోతున్నారు.