Telangana: భార్యను బైక్ పై నుంచి తోసేసి.. చిన్నారుల గొంతు కోసి.. కన్నతండ్రి కర్కశత్వం
కన్నతండ్రి క్షణికావేశానికి కడుపున పుట్టిన ఇద్దరు చిన్నారులు బలయ్యారు. భార్యాభర్తల గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. తన పిల్లల గొంతు కోసి చంపిన దారుణ దుశ్చర్య ఇది. భార్యను బైక్ పై నుంచి తోసేసి, చిన్నారులను పొదలల్లోకి తీసుకెళ్లి మరీ ఈ...
కన్నతండ్రి క్షణికావేశానికి కడుపున పుట్టిన ఇద్దరు చిన్నారులు బలయ్యారు. భార్యాభర్తల గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. తన పిల్లల గొంతు కోసి చంపిన దారుణ దుశ్చర్య ఇది. భార్యను బైక్ పై నుంచి తోసేసి, చిన్నారులను పొదలల్లోకి తీసుకెళ్లి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగిచింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్.. తన భార్య చనిపోవడంతో జావాయిపల్లి గ్రామానికి చెందిన మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓంకార్ కు మద్యం తాగే అలవాటు ఉంది. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారింది. కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఓంకార్ జులాయిగా తిరుగుతుండటంతో భార్య హెచ్చరించింది. అయినా అతనిలో మార్పు రాకపోయేసరికి పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్య కూడా వెళ్లిపోవడంతో ఓంకార్ ఒంటరి వాడయ్యాడు. మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కుడికిల్ల గ్రామం నుంచి కొల్లాపూర్కు మకాం మార్చాడు. సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన ఓంకార్.. బుధవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని చెప్పి బైక్ పై భార్య, పిల్లలను ఎక్కించుకుని నాగర్కర్నూల్కు పయనమయ్యాడు. మార్గమధ్యలో భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్యను బైక్ పై నుంచి కిందికి తోసేశాడు. తర్వాత కొంత దూరం వెళ్లాక రోడ్డు పక్కన బండి ఆపి ఇద్దరు పిల్లల్ని తీసుకుని పొదల్లోకి వెళ్లాడు. పిల్లల గొంతు కోశాడు. అనంతరం తానూ కోసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే చిన్నారులు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఓంకార్ను నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి