Andhra Pradesh: హైకోర్టు ఉద్యోగుల పేరుతో మోసం నిరుద్యోగులకు కుచ్చుటోపీ.. TV9 కెమెరాకు చిక్కిన కేటుగాళ్ళు..
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. పరీక్షలుంటాయి. అదే ఔట్ సోర్సింగ్ అయితే కార్పొరేషన్ ఉంది. డబ్బులు కడితే ఉద్యోగాలొస్తాయని..
నిరుద్యోగులను మోసం చేసేవాళ్ళు రోజురోజుకు మితిమీరిపోతున్నారు. పేపరులో నోటిఫికేషన్ పడిందంటే చాలు వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ షురూ.. ఉద్యోగం వస్తే చాలు అనుకునే వాళ్ళను టార్గెట్ చేస్తారు.. వాళ్ళ అవసరాన్ని బట్టి డిమాండ్ చేస్తారు.. సర్టిఫికేట్ల నుంచీ డబ్బు వరకూ అంతా వాళ్ళ తీరే వేరు.. వాళ్ళ మాటలు వింటే.. నిజమే వీళ్ళు చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు అనిపించక మానదు.. అనుకున్న టార్గెట్ చాలా తేలిగ్గా పూర్తిచేస్తారు. చివరకు హ్యాండిచ్చి చల్లగా జారుకుంటారు. ఏకంగా హైకోర్టు ఉద్యోగాలనే టార్గెట్ చేసిందాముఠా. నిరుద్యోగులను ముంచే ముఠా ఆగడాలపై టీవీ-9 నిఘా స్టోరీ.
టీవీ-9 బృందం నిరుద్యోగులుగా మారి ఆ ముఠాను అప్రోచ్ అయింది. మీకెందుకు కష్టం. జస్ట్ మీ సర్టిఫికేట్లు ఫోటో తీసి వాట్సప్ చేయండి. ఎక్కడ పోస్టులున్నాయి.. ఎంత కట్టాలి.. ఎప్పుడు కలవాలి.. అన్నీ సవివరంగా చెపుతాం అంటూ ముఠా సభ్యుడు టీవీ-9 బృందానికి చెప్పుకొచ్చాడు. ఒకసారి కలుద్దాం అని చెప్పిన టీవీ-9 బృందానికి.. విజయవాడలో ఎక్కడ కలవాలో నిర్ణయించి చెపుతానన్నాడు. ఆ తరువాత తానే ఫోన్ చేసి బందరు రోడ్డులోకి వచ్చి కాల్ చేయండి, సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో కలుద్దాం అన్నాడు.
ముఠా సభ్యుడు చెప్పిన ప్రాంతానికి టీవీ-9 బృందం చేరుకుంది. టీవీ-9 ప్రతినిధి, తాను నిరుద్యోగిని అని, కుటుంబం కష్టాలలో ఉందని, ఎలా అయినా ఉద్యోగం ఇప్పించమని అడిగారు. వెంటనే మీకెందుకు.. ఏపీ హైకోర్టులో మా మాటకు ఎదరు లేదు, మావాడున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. మీ కష్టాలు తీరిపోయినట్టే, కాకపోతే.. కొంత ఖర్చుపెట్టాలన్నాడు. చూసి చెప్పండి సర్ అన్నారు టీవీ-9 ప్రతినిధి. అంతే ఏముంది.. మీకు కాబట్టి 3 లక్షలకు ఇప్పిస్తా.. నాకు వచ్చేది పదివేలే, మీకేం భయం లేదు, మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు, మూడు లక్షలు నాకు ఇవ్వండి, నేను ప్రభుత్వ ఉద్యోగిని.. అంటూ నమ్మించాడు. నమ్మకం కలిగించేలా తన ఐడీ కార్డు తీసి, బందరు ఆర్డీఓ కార్యాలయంలో సబార్డినేట్ సర్వీసులో ఉన్నానంటూ, తనపేరు తిరుమలరావు అని చెప్పుకోచ్చాడు.
అన్నీ ఎరేంజ్ చేస్తాం.. మాకు ఓకే.. కానీ ఓసారి హైకోర్టుకు తీసుకెళితే మాకు నమ్మకం కలుగుతుందని టీవీ-9 బృందం చెపితే.. ఏమాత్రం జంకకుండా హైకోర్టుకు తీసుకెళ్ళాడు. మధ్యలో ఏపీ సెక్రటేరియట్ కి తీసుకెళ్ళి అక్కడొక ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పరిచయం చేశాడు. అతనికి హైకోర్టు కొట్టిన పిండి అని, అతను చాలా పెద్ద కేడర్లో ఉన్నవారితో మాట్లాడి ఉద్యోగంలో పెడతాడని చెప్పి, అతనిని కూడా తీసుకుని, టీవీ-9 బృందాన్ని హైకోర్టుకు తీసుకెళ్ళాడు. అక్కడ అసలు డ్రామా మొదలెట్టాడు. మీరు ఒకవేళ రూ. 3 లక్షలు ఇవ్వలేకపోతే, నాకు రూ.2 లక్షలు ఇవ్వండి అంటూ డిస్కౌంట్ ఇచ్చిన దానకర్ణుడిలా మాట్లాడాడు. అంతేనా, లక్ష అడ్వాన్స్.. ఒరిజినల్ సర్టిఫికేట్లు, తెమ్మన్నాడు. రెండో వ్యక్తి టీవీ-9 బృందాన్ని పక్కకు తీసుకెళ్ళి, నాకు రూ.80వేలు ఇస్తే చాలు అన్నాడు. ఇద్దరూ రెండు మాటలు చెప్పి ముందు అర్జంటుగా సర్టిఫికేట్లు, డబ్బు తెమ్మన్నారు.
ఇంతలో టీవీ-9 కెమెరా కనిపించగానే వామ్మో వాయ్యో అనుకుంటూ… మాకేం తెలీదు.. మేమెందుకో వచ్చాం.. వీళ్ళెవరో అంటూ ప్లేటు పిరాయించాడు ఒకడు. ఇంకొకడు మాత్రం నేను పదివేలు తీసుకుంటా అంటూ పెద్ద ఎక్కువేం కాదన్నట్టు బిల్డప్పిచ్చాడు. అంతేనా.. ఎవరో ఖాన్ అట.. ఆయన మాటతోనే హైకోర్టులో ఉద్యోగంలో పెట్టిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. అంతేనా.. ఒక నకిలీ ఐడీ కార్డు కూడా చూపించాడు. అది సరిగా చూపించడానికి జంకాడు. చివరకు ఇద్దరూ చెరోదారికి పరారయ్యారు.
మునిసిపాలిటీలో ఉద్యోగాల పేరిట లక్షలు వసూలు చేశాడని, వేరే దిక్కులేక మీడియాను ఆశ్రయించామని తెలిపారు బాధితులు. రెండు లక్షలతో మొదలెట్టి వాళ్ళ వాళ్ళ స్తోమతు తెలుసుకుని మరీ వసూళ్ళకు దిగాడు. అలా దాదాపు రూ. 30 లక్షలకు పైగా వసూలు చేశాడు. పెనమలూరుకు చెందిన బాధితుడు చెపుతున్నది వింటే మాత్రం వామ్మో అనిపించకమానదు.
సో.. నిరుద్యోగులూ.. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. పరీక్షలుంటాయి. అదే ఔట్ సోర్సింగ్ అయితే కార్పొరేషన్ ఉంది. డబ్బులు కడితే ఉద్యోగాలొస్తాయని భ్రమలో పడకుండా, మీ కష్టం మీద, మీ చదువుతో వచ్చే ఉద్యోగం చేసుకోకుండా, ఇలాంటి కేటుగాళ్ళ వలలో పడకండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..