Road Accident: సెంట్రల్ మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు – లారీ ఢీకొని 41 మంది దుర్మరణం.. 33 మందికి గాయాలు
మాలి దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలను కోల్పోయారు.
ఆఫ్రికా దేశమైన మాలి దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలను కోల్పోయారు. సెంట్రల్ మాలిలో మంగళవారం కురిసిన భారీ వర్షాల సమయంలో బస్సును లారీ ఢీకొనడంతో 41 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. సెగో పట్టణానికి సమీపంలో వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళ్తున్న లారీని ప్యాసింజర్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక శిశువు కూడా ఉన్నారని రవాణా మంత్రి డెంబెలే మదీనా సిస్సోకో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
వేగంగా వచ్చిన ట్రక్కు టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, మరో మార్గంలోకి దూసుకువెళ్లి బస్సును ఢీకొట్టింది. సెగో పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
Read Also…