AP News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం..
లారీ ఢీకొనడంతో బైక్పై వెళుతున్న నలుగురులో ముగ్గురు మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
Annamayya district Road Accident: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జిల్లాలోని కురబలకోట మండలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిలోని ఠాణామిట్ట వద్ద జరిగింది. ఠాణామిట్ట వద్ద వర్షంలో రోడ్డును క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొనడంతో బైక్పై వెళుతున్న నలుగురులో ముగ్గురు మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. లారీ ఢీకొని.. బైక్పై నుంచి వెళ్లడంతో.. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. దీంతోపాటు మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
మృతులు పెద్దమండ్యం మండలం (ఎద్దుల వారిపల్లి) కలిచర్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మదనపల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.