సీపీఎంలో సిగపట్లు.. సీతారాం ఏచూరికి దక్కని రాజ్యసభ సీటు ?
సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికి ఈ సారి రాజ్యసభ సీటు దక్కనట్టే కనిపిస్తోంది. ఎగువసభలో ఈ సారి కూడా తాను అడుగు పెడతానని ఆశిస్తున్న ఆయనకు పార్టీ గతంలో ఒకసారి మాదిరే ఈ సారీ షాక్ ఇచ్చింది.
సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికి ఈ సారి రాజ్యసభ సీటు దక్కనట్టే కనిపిస్తోంది. ఎగువసభలో ఈ సారి కూడా తాను అడుగు పెడతానని ఆశిస్తున్న ఆయనకు పార్టీ గతంలో ఒకసారి మాదిరే ఈ సారీ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఎగువసభకు జరగనున్న ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు సీపీఎం అనుమతించడంలేదు. ఇందుకు నిబంధనలు, పార్టీ కోడ్, రాజకీయ ఒత్తిడులను సాకుగా చూపుతోంది. ఆయనను రాజ్యసభకు పంపరాదని గతనెల 6 న ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీలో కేరళ వర్గానిదే పై చేయిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీతారాం ఏచూరిని రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదనను ఆ సమావేశం తోసిపుచ్చింది. మొదట పార్టీలోని పశ్చిమ బెంగాల్ వర్గం ఆయన అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో పోటీ చేయరాదన్నది పాత సంప్రదాయమని, ఎప్పటినుంచో దీన్ని పాటిస్తున్నామని సీనియర్ నేత ఒకరు తెలిపారు. పైగా రెండు సార్లకు మించి ఒకే వ్యక్తిని రాజ్యసభకు పార్టీ నామినేట్ చేయజాలదన్నారు.
2005-2017 మధ్య కాలంలో సీతారాం ఏచూరి ఎగువసభ సభ్యుడిగా ఉన్నారు. 2017 లో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే వెస్ట్ బెంగాల్ లో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్ సిధ్దపడింది. అప్పట్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చేతిలో సీపీఎం ఓడిపోవడంతో పరిస్థితి మారింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, తృణమూల్ కాంగ్రెస్ ని ఎదుర్కొన్న తరుణంలో ప్రత్యర్థిగా మారిన కాంగ్రెస్ సహాయాన్ని తీసుకోవడమన్నది తమ పార్టీ సిధ్ధాంతాలకు విరుధ్ధమని సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. అయితే సీతారాం ఏచూరి వంటి సీనియర్ నాయకుడికి వ్యతిరేకంగా ఉన్న వర్గమే ఆయనను రాజ్యసభకు పంపేందుకు మోకాలడ్డుతోందని ఆయన అనుకూల వర్గం పేర్కొంటోంది.