మడంతిప్పి భయంతో దాసోహమయ్యారు
మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ .. రోజు మాట తప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా జగన్ మారిపోయారని విమర్శించారు..
మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ .. రోజు మాట తప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా జగన్ మారిపోయారని విమర్శించారు. తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాలకు జగన్ పంగనామాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్ ను ఎత్తేసేందుకే విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు. జీఎస్టీ నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వడం లేదని.. మోదీ సర్కారు విధానాల పట్ల ముఖ్యమంత్రులు తిరగబడే పరిస్థితి వచ్చిందని అన్నారు. జగన్ మాత్రం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కరోనా నియంత్రణలో సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు.