కీలక నిర్ణయం తీసుకున్న ప్రయాగ్‌రాజ్ వెటర్నరీ అధికారులు.. గోవుల కోసం ప్రత్యేకంగా చలి కోట్లు..

గోవుల సంరక్షణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. చలికాలం నేపథ్యంలో గోవుల సంరక్షణకు ఆ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

కీలక నిర్ణయం తీసుకున్న ప్రయాగ్‌రాజ్ వెటర్నరీ అధికారులు.. గోవుల కోసం ప్రత్యేకంగా చలి కోట్లు..
Follow us

|

Updated on: Nov 26, 2020 | 2:24 PM

గోవుల సంరక్షణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. చలికాలం నేపథ్యంలో గోవుల సంరక్షణకు ఆ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. చలి తీవ్రత దృష్ట్యా జిల్లా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాలల్లోని గోవులకు చలి కోట్లను ఏర్పాటు చేయాలని ప్రయాగ్‌రాజ్ జిల్లా వెటర్నరీ డిపార్ట్‌మెంట్ అధికారులు నిర్ణయించారు. అలాగే మందమైన పాలిథిన్ తెరలతో గోశాలల్లో చలిగాలులు వీచకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జిల్లా వెటర్నరీ అధికార యంత్రాంగం వెల్లడించింది. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. పశువుల సంరక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో గోశాలలను ఏర్పాటు చేశారు. గోవులకు గ్రాసం, నీటి సదుపాయాలు వంటి వసతులను అధికారులే కల్పిస్తున్నారు. ఈ షెల్టర్ల నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించి.. ప్రత్యేకంగా సరంక్షకులను నియమించారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో 113 గోశాలలు ఉండగా, వీటిలో 110 తాత్కాలిక షెల్టర్లు, 3 శాశ్వత షెట్లర్లు ఉన్నాయి. ఈ షెల్టర్లలో మొత్తం 13,000 గోవులు సంరక్షించబడుతుండగా, వీటి సంరక్షణ బాధ్యతలను నేరుగా వెటర్నరీ శాఖ చూస్తోంది.

కాగా, చలి తీవ్రత దృష్ట్యా గోవుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్నందున, గోవుల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. దాని ప్రకారం.. షెల్టర్లలో చలి గాలులు వీచకుండా ప్రత్యేక పరదాలను ఏర్పాటు చేయడంతో పాటు.. గోవులకు చలి కోట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్‌లను కొనుగోలు చేసి వాటితో గోవులకు అనువైన కోట్లను తయారుచేయించడం జరుగుతుందని చీఫ్ వెటర్నరీ అధికారి ఆర్‌పి రాయ్ తెలిపారు. వీటి తయారీ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించడం జరుగుతుందని, నిధులు ఎంఎన్ఆర్ఈజీ నుంచి కేటాయించడం జరుగుతుందని ఆయన చెప్పారు.