Covid Vaccine ready : మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంతా సిద్ధం.. భారీ బందోబస్తు మధ్య కరోనా టీకా తరలింపు
వ్యాక్సిన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. భారీ భద్రత మధ్య దాదాపు అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ తరలిస్తున్నారు.
వ్యాక్సిన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఈనెల 16 నుంచి తెలుగురాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా టీకా వేయనున్నారు. మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేవలం ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. భారీ భద్రత మధ్య దాదాపు అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ తరలిస్తున్నారు. అన్ని సెంటర్లలో అధికారులు అలెర్ట్గా ఉన్నారు. ఫ్రంట్ వారియర్స్కి ఇప్పటికే సూచనలు జారీ చేసింది ప్రభుత్వం. తొలిదశలో ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న 3లక్షల 64వేల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సింగ్ భద్రత కోసం 800 కోల్డ్ చైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి వ్యాక్సిన్ ను జిల్లా కేంద్రాల్లోని ఇమ్యూనేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వ్యాక్సిన్ ను 2నుంచి 8 సెంటి గ్రేడ్ల ఉష్ణోగ్రతలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి ప్రాధాన్యత కింద 139 వ్యాక్సిన్ కేంద్రాల్లో 2లక్షల 90వేల మందికి వ్యాక్సిన్ వేస్తారు. ఈనెల 16న 13వేల 900 మంది హెల్త్వర్కర్లకు వ్యాక్సిన్ వేస్తారు. ఇప్పటికే రాష్ట్రానికి 16లక్షల సిరెంజ్లు చేరాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 10లక్షల మంది ఉద్యోగులను ఆరోగ్యశాఖ రెడీ చేసింది.
తెలంగాణలో మొత్తం 15 వందల వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటుచేయగా..మొదటి రోజు టీకా పంపిణీకి 139 కేంద్రాలను ఎంపిక చేశారు.. అందులో 99 ప్రభుత్వ ఆసుపత్రులు, 40 ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 13, మేడ్చల్లో 11, రంగారెడ్డి జిల్లాలో 9 ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఈ మూడు జిల్లాల్లోనే 33 టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు 15 లక్షల సిరంజీల పంపిణీ పూర్తి అయిందని వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఉదయం కోఠిలోని వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రానికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ చేరుకుంది. మూడు బాక్స్లలో వ్యాక్సిన్ డోసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఇక, అటు వ్యాక్సిన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారీ బందోబస్తు నడుమ కృష్ణాజిల్లా గన్నవరం వ్యాధినిరోధక టీకాల కేంద్రం నుంచి అన్ని జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ తరలించారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న 3లక్షల 70వేల మంది వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు.
కేసుల తీవ్రత, ఫ్రంట్లైన్ ఉద్యోగుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు వేల సంఖ్యలో డోసులు పంపారు. కృష్ణాజిల్లాకు 42,500 డోసులు, గుంటూరుజిల్లాకు 43,500 డోసులు తరలించారు. దీంతో పాటు ప్రకాశంజిల్లా 31 వేలు, నెల్లూరుకు 38,500 డోసులు, వెస్ట్గోదావరి 33,500, ఈస్ట్గోదావరిజిల్లాకు 47వేల డోసులు పంపించారు. ఇక శ్రీకాకుళంజిల్లాకు 26,500, విశాఖకు 46,500, విజయనగరం 21,500, అనంతపురంజిల్లాకు 35,500, కడపజిల్లాకు 28,500, కర్నూలుకు 40,500 వ్యాక్సిన్ డోసులు తరలించారు.
మరోవైపు కరోనా వ్యాక్సిన్ల పంపిణీపై తాజాగా కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు డోసులకు మధ్య 28 రోజుల సమయం ఉంటుందని తెలిపింది. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత.. వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక భారత్లో ఉత్పత్తి అవుతున్న కరోనా టీకాల కోసం ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి. కోవాగ్జిన్ కోసం బ్రెజిల్ దేశం భారత్ బయోటెక్తో కీలక ఒప్పందం చేసుకుంది. ఆ దేశానికి 12 మిలియన్ డోసుల వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. ఇటు భారత్ బయోటెక్లో తయారైన వ్యాక్సిన్ ఢిల్లీకి చేరుకుంది. మిగతా రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తోంది.