కోవిడ్-19మహమ్మారి ఇప్పుడే అంతం కావడం కష్టం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ
కోవిడ్-19 మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యే సూచనలు కనబడడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ అన్నారు. ఆరు నెలల క్రితం చైనా తమ సంస్థను దీనిపై అలర్ట్ చేసిందని, కానీ కోటి మందికి..
కోవిడ్-19 మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యే సూచనలు కనబడడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ అన్నారు. ఆరు నెలల క్రితం చైనా తమ సంస్థను దీనిపై అలర్ట్ చేసిందని, కానీ కోటి మందికి పైగా ఈ ఇన్ఫెక్షన్ కి గురయ్యారని, 5 లక్షల మంది మరణించారని ఆయన చెప్పారు. ఈ వైరస్ కి ప్రజలు గురవుతూనే ఉన్నారని, దీని నిర్మూలన జరగడానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చునన్నారు. ఇది అంతరించాలని మనమంతా కోరుకుంటున్నాం.. మన జీవితాలను సురక్షితంగా కొనసాగించాలనుకుంటున్నాం.. కానీ ఇప్పట్లో ఇది నశించేలా కనిపించడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ పై పోరులో కొన్ని దేశాలు కొంతవరకు పురోగతి సాధించాయని, అలాగే వ్యాక్సీన్ కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని టెడ్రోస్ చెప్పారు. ఏమైనా, టెస్టింగ్, ఐసోలేషన్,, ట్రాకింగ్ వంటి చర్యలతో ఈ వైరస్ వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్ఛునన్నారు. కొన్ని దేశాలు ఈ విషయంలో సఫలమవుతున్నాయి అని చెప్పిన అయన.. ఇందుకు ఉదాహరణగా జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ దేశాలను ప్రస్తావించారు. వ్యాక్సీన్ కనుగొనే విషయంలో ఎంతవరకు పురోగతి సాధించామనే విషయాన్ని సమీక్షించేందుకు ఈ వారంలో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.