కరోనాతో కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగింది : కేంద్రం
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది: లవ్ ఆగర్వాల్
లాక్డౌన్ 5.0ను కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసిన కేంద్రం తాజాగా దేశంలో కరోనా ప్రభావానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ ఆగర్వాల్ వెల్లడించారు. గత 24 గంటల్లో 3,708 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 48.07 శాతం ఉందని, కరోనా మరణాల్లో 73 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనాపై పోరాటంలో టెలీమెడిసిన్ ఎంతో ఉపయోగకరమని, ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని లవ్ అగర్వాల్ సూచించారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 2.82శాతంగా ఉండగా, ప్రపంచంలోనే ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువని లవ్ అగర్వాల్ వెల్లడించారు. భారత్లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులున్నాయని, కోలుకుంటున్నవారి సంఖ్య లక్ష దాటిందని ప్రకటించారు. దేశంలో రోజుకు లక్షా 20 వేల కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.