రాజధానిలో కరోనా విజృంభణః ఒక్క రోజే 223 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1993 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1993 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 35,043 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 1,147 మరణాల కేసులు నమోదయ్యాయి. 25007 యాక్టివ్ కేసులుండగా, గత 24 గంటల్లో 564 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 8889 మంది కోలుకున్నారు. ఇక దేశరాజధాని హస్తినలోనై వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
ఢిల్లీలో వైరస్ విలయతాండవం చేస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 223 కరోనా కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా, 73 మంది కోవిడ్ బారినుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,738కి చేరింది. వీరిలో 1,167 మంది కోలుకోగా, మొత్తం 61 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 2,510 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో నమోదైన కోవిడ్ కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. అయితే.. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 2,300 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.