12 లక్షల మంది కూలీలకు సర్కార్ సాయం..రూ. 2వేల చొప్పున
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకూ వైరస్ పుంజుకుంటూ ప్రతాపం చూపెడుతోంది. ప్రభుత్వాలు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నప్పటీకీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూలీలకు సర్కార్ ఆర్థిక సాయం ప్రకటించింది.
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకూ వైరస్ పుంజుకుంటూ ప్రతాపం చూపెడుతోంది. ప్రభుత్వాలు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నప్పటీకీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా
మహారాష్ట్రలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. శనివారం ఒక్క రోజే ఇక్కడ కొత్తగా 328 కేసులు నమోదు కాగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 3648కి చేరింది. దీంతో అధికార యంత్రాంగం లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మహా కూలీలకు సర్కార్ ఆర్థిక సాయం ప్రకటించింది.
లాక్డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రాలో దినసరి కూలీలు, భవననిర్మాణ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కూలిపనులు దొరక్క పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.కొన్ని చోట్ల బాధితులు ఆకలిబాధతో నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో కూలీలను ఆదుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్రంలోని 12 లక్షల మంది భవన నిర్మాణ కూలీలకు రూ. 2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని రాష్ట్ర కార్మిక మంత్రి దిలీప్ వాస్లే తెలిపారు. మహారాష్ట్ర బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్న అందరికీ ఈ సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పడుతుందన్నారు. వలస కూలీలకు యూపీ ప్రభుత్వం రోజుకు రూ. వెయ్యి ప్రకటించడం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం కూడా వారికి రూ.5 వేల సాయం చేస్తామని తెలిపింది.