Worldwide Coronavirus Updates: ప్రపంచదేశాల్లో మరణమృదంగం మోగిస్తున్న కరోనా.. 20 లక్షలు దాటిన మరణాలు
ఏడాది గడిచినా ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. తొలి 10 లక్షల మరణాలు నమోదు కావడానికి 8 నెలలు పట్టగా... తర్వాత 10 లక్షలు నమోదకి కేవలం 4నెలలు మాత్రమే పట్టాయి...
Worldwide Coronavirus Updates: ఏడాది గడిచినా ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. దేశ విదేశాల్లో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9,43,14,589కి చేరింది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ తో 20,17,903 మంది మరణించారు. ఇప్పటి వరకూ 6,73,45,871 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కోవిడ్ పుట్టినిల్లు అయిన వుహాన్లో తొలిమరణం నమోదైన సరిగ్గా ఏడాది తర్వాత మరణ సంఖ్య 20 లక్షలకు చేరుకోవడం విశేషం. తొలి 10 లక్షల మరణాలు నమోదు కావడానికి 8 నెలలు పట్టగా… తర్వాత 10 లక్షలు నమోదకి కేవలం 4నెలలు మాత్రమే పట్టాయి. దీంతో ఈ వ్యాధి తీవ్రత అర్ధమవుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం శుక్రవారానికే మరణాలు 20 లక్షలు దాటిపోయాయి.అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 20 లక్షలు కేవలం అధికారికంగా నమోదు చేసిన మరణాలేనని.. లెక్కలోని రానివి ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు. లక్షణాలు లేకుండా మరణించినవారు.. ఇళ్లలోనే పరీక్షలు చేయించుకోకుండా మరణించిన వారు చాలా మంది ఉంటారని అంటారు.
ముఖ్యంగా ఈక్వెడార్, పెరు, రష్యా వంటి దేశాల్లో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే 300-500 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓవైపు కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై వివిధ దశల్లో ఉంది. మరోవైపు కొన్ని దేశాల్లో ఈ వైరస్ సెకండ్ వేవ్ తో విజృంభిస్తుంది. అమెరికా, జర్మనీ, స్వీడన్, ఇండోనేసియా, ఇజ్రాయెల్, జపాన్ దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంది.