సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా..ఆందోళన వద్దుః కేటీఆర్
ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు.
ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నిన్నటి నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తాను బాగానే ఉన్నానని తెలిపారు. సిరిసిల్లలో సోమవారం నాటి పర్యటన సందర్భంగా తనకు అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందన్నారు. అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చిందన్నారు.
మంత్రి కేటీఆర్ సోమవారం నాడు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్స్ పార్కులో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఎపెరెల్ పార్క్ లో మళ్లీ మగ్గం శబ్దాలు వినిపిస్తున్నాయి.. లాక్ డౌన్ కారణంగా గత 45 రోజులుగా నేత ఆగిపోయింది..మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని మళ్లీ చేనేత పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ పార్క్ లో బతుకమ్మ చీరలను నేస్తున్నారు.. దీనిపై కేటీఆర్ ట్విట్ చేస్తూ, సిరిసిల్ల చేనేత సోదరులు, సోదరీమణుల ప్రతిభ పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో చేనేత పని పునఃప్రారంభమైందని, బతుకమ్మ చీరలు నేయడం కొనసాగిస్తున్నారని ట్వీట్ చేశారు. సిరిసిల్ల చేనేత ఉత్పత్తులంటే ఓ ఎన్నదగిన బ్రాండ్ గా అభివృద్ధి చేయడమే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని కేటీఆర్ వివరించారు. అయితే, సిరిసిల్ల పర్యటన సందర్భంగా ఆయన తీవ్రమైన జలుబు, తుమ్ములతో ఇబ్బంది పడుతూ కనిపించటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.