India Corona: దేశవ్యాప్తంగా మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి.. పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆ రాష్ట్రంలోనే అత్యధికం..!
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంబిస్తోంది. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 47వేలుకు పైగా కేసులు నమోదయ్యాయి.
India Coronavirus Cases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంబిస్తోంది. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 47వేలుకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతేస్థాయిలో మరణాలు కూడా 500పైనే నమోదుకావడం గమనార్హం. అయితే, కొత్త కేసుల్లో 70శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 47,092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3.28కోట్లు దాటింది. ఇదే సమయంలో నిన్న ఒక్క రోజే 509 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇప్పటివరకు 4,39,529 మందిని మహమ్మారి బలితీసుకుంది. ఇక నిన్న మరో 35,181 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.20కోట్ల మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీరేటు 97.48శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశ మొత్తం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే, తొలి కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజే 32,803 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం కేసుల్లో మూడింట రెండొంతులు ఒక్క ఈ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. ఇక ఇక్కడ మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండటం కలవరపెడుతోంది. నిన్న ఆ రాష్ట్రంలో 173 మరణాలు నమోదయ్యాయి.
ఇదిలావుంటే, కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ ఎక్కువవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,89,583 మంది వైరస్తో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 1.19శాతానికి పెరిగింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 81 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 66కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. Read Also… World Coconut Day: కొబ్బరితో కోటి లాభాలు.. ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఆ ప్రయోజనలేంటో తెలుసుకుందామా.!