కరోనా షాకింగ్: కోలుకున్న వారిలో కొత్త లక్షణాలు..
ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ కాగానే శ్వాస సంబంధిత సమస్యలపైనే వైద్యులు ఎక్కువగా దృష్టి సారించి చికిత్స అందిస్తున్నారని..కానీ, మరణానికి దారితీసే..
కోవిడ్-19: భూతం ప్రపంచ దేశాలపై ప్రతాపం చూపుతోంది. రోజురోజుకూ మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. బీమారిలా వచ్చి మహమ్మారిలా మారిన కరోనా..వందలు, వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరింపజేస్తోంది. వైరస్ అంతానికి సరైన వ్యాక్సిన్ కనుగోనే పనిలో ప్రపంచ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్కి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండగా.. గుండెపైనా ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్లో ప్రచురించిన ఓ అధ్యయనంలో సంచలన వివరాలు పేర్కొన్నారు.
కరోనా వైరస్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై పలు సంస్థలు అధ్యయనం జరుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వైరస్ బారినపడి కోలుకున్న పలువురు రోగుల్లో ఇతర సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు నిర్ధారించారు. హార్ట్ ఎటాక్, గుండె పోటు, రక్తం గడ్డకట్టేందుకు కరోనా వైరస్ దోహదం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజాగా అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో అనేక విషయాలను కనుగొన్నారు. కరోనా వైరస్ నివారణకు వినియోగిస్తున్న డ్రగ్స్.. గుండె సంబంధిత రోగాల మందులతో కలిస్తే..వారిలో రియాక్షన్స్ కు దారితీసే ప్రమాదం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దాంతో హృద్రోగుల్లో అది ప్రాణాంతకంగా మారుతుందని వారు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ కాగానే శ్వాస సంబంధిత సమస్యలపైనే వైద్యులు ఎక్కువగా దృష్టి సారించి చికిత్స అందిస్తున్నారని.. మరణానికి దారితీసే గుండె, రక్తనాళాల రుగ్మతలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచించారు.