కరోనాను జయించిన 12 రోజుల “ప్రకృతి”
కరోనా సోకిన 12 రోజుల పసికందు కోలుకుంది. చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు స్థానిక వైద్యులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే…
కోవిడ్-19 భూతం కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి అతి తక్కువ సమయంలోనే దేశాలు వ్యాపించి వేల మంది ప్రజల్ని బలి తీసుకుంటుంది. ఇక దీని బాధితులు లక్షల్లో ఉన్నారు. ఇంతవరకు దీనికి సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రపంచదేశాలకు ఇది తలనొప్పిగా మారిపోయింది. కోవిడ్ వైరస్ని కట్టడి చేసేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇటువంటి విప్కతర పరిస్థితుల్లో కరోనా సోకిన 12 రోజుల పసికందు కోలుకుంది. చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు స్థానిక వైద్యులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే…
భోపాల్లో ఏప్రిల్ 7న సుల్తానియా జనన ఆస్పత్రిలో ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే,
బిడ్డ పుట్టిన తొమ్మిది రోజులకు కరోనా పాజిటివ్గా తేలింది. ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న సిబ్బంది నుంచి చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారించిన వైద్యులు చికిత్సనందించారు. అనంతరం పసికందు పూర్తిగా కోలుకుంది. అనంతరం చిన్నారిని, తల్లితోపాటు డిశ్చార్జి చేశారు. ఈ సందర్బంగా బిడ్డ తండ్రి మాట్లాడుతూ…పాపకు ప్రకృతి అని నామకరణం చేశామని చెప్పారు. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జన్మించిన చిన్నారి విజయం సాధించిందన్నారు. అందుకే తమ బిడ్డకు ప్రకృతి అని పేరు పెట్టామని అన్నారు.