లాక్డౌన్: అత్యవసర ప్రయాణాల కోసం జగన్ సర్కార్ కొత్త నిర్ణయం..!
కరోనా లాక్డౌన్ వేళ అత్యవసర ప్రయాణాల కోసం జగన్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారి కోసం
కరోనా లాక్డౌన్ వేళ అత్యవసర ప్రయాణాల కోసం జగన్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారి కోసం కోవిడ్-19 అత్యవసర పాసులను అందిస్తామని డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో లాక్డౌన్ పక్కాగా అమలవుతోందని తెలిపిన పోలీస్ శాఖ.. అత్యవసర ప్రయాణాల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.
పాసులు కావాలనుకునేవారు.. పేరు, పూర్తి చిరునామా, ఆధార్ కార్డు వివరాలు, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే వివరాలు తెలపాలని పోలీస్ శాఖ తెలిపింది. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత.. సంబంధిత పోలీస్ అధికారులు పాసులు జారీ చేయనున్నట్లు వివరించారు. అయితే వాటిలో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీలకు అప్లైయ్ చేసుకోవచ్చని తెలిపిన పోలీస్ శాఖ.. వాటి వివరాలను విడుదల చేసింది. అంగీకరించిన అనుమతి పత్రాలు అప్లై చేసుకున్న వారి మొబైల్ నెంబర్/మెయిల్ ఐడీకి పంపిస్తారని తెలిపారు. జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్/మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని.. ఫార్వార్డ్ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవని.. ఇక ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని డీజీపీ కార్యాలయం వెల్లడించింది.
Read This Story Also: లాక్డౌన్ వేళ.. రజనీ ఇంటి ముందు సడన్ ధర్నా.. షాకైన తలైవా ఫ్యామిలీ..!