కరోనా: భారత వైద్యులను ఫాలో అవుతోన్న ఆస్ట్రేలియా డాక్టర్లు..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ మహమ్మారికి విరుగుడును కనుగునేందుకు శాస్త్రవేత్తలకు భారీ నిధులను కేటాయిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ మహమ్మారికి విరుగుడును కనుగునేందుకు శాస్త్రవేత్తలకు భారీ నిధులను కేటాయిస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా 81,960 మంది ఈ వైరస్ను జయించిన విషయం తెలిసిందే. వీరిని రికవరీ చేసే క్రమంలో చాలామంది డాక్టర్లు కూడా సఫలం అయ్యారు. కాగా రాజస్థాన్లోని జైపూర్లో ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నలుగురు కరోనా బాధితులు ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. మలేరియా, స్వైన్ ఫ్లూ, హెచ్ఐవీ మందుల కాంబినేషన్లోని డ్రగ్స్ను కరోనా బాధితులకు ఇవ్వగా.. వారు కోలుకున్నారు. ఇక ఇప్పుడు మన వైద్యులను ఫాలో అవుతున్నారు ఆస్ట్రేలియాలోని డాక్టర్లు.
కంగారు దేశంలో ఇప్పటికీ 452 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 23మంది కోలుకున్నారు. 5మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్కు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలనుకుంటోన్న అక్కడి వైద్యులు క్లోరోక్విన్, లోపినవిర్-రిటోనవిర్లను కలిపి ఓ మెడిసిన్ను కరోనా కోసం తయారు చేయబోతున్నారట. ఈ మందులు సాధారణంగా మలేరియా, హెచ్ఐవీలకు ఉపయోగిస్తుంటారు. వీటిని టెస్ట్ట్యూబ్లో ట్రై చేయగా.. కరోనా పరిస్థితులను ఇవి ఎదుర్కొన్నాయని ద యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ల్యాండ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ డైరక్టర్ ప్రొఫెసర్ డేవిడ్ పీటర్సన్ తెలిపారు. కరోనాకు హెచ్ఐవీ మందు పనిచేయడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయినట్లు ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాలో ఉన్న చైనా బాధితుల్లో చాలా మంది ఈ డ్రగ్ వలన కోలుకున్నట్లు ఆయన తెలిపారు. ఏదేమైనా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో ఇది నిజంగా కాస్త ఊరట కలిగించే వార్తనే.