వైరస్ వ్యాప్తికి వారే కారకులు..? తప్పుడు చిరునామాతో..
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొందరు వ్యక్తులు క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేసి తప్పుడు చిరునామా ఇచ్చి
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొందరు వ్యక్తులు క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేసి తప్పుడు చిరునామా ఇచ్చి.. అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికార యంత్రాంగానికి బురిడీ కొట్టించి వైరస్ ప్రబలడానికి కారణం అవుతున్నారు. దీంతో కర్ణాటకలో భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరుతో పాటు మరో 12 జిల్లాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది.
ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే వారు 14 రోజులు హోం క్వారంటైన్ ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయితే కొందరు నిర్లక్ష్యంతో క్వారంటైన్లో ఉండకుండా తప్పుడు వివరాలు ఇచ్చారు. ఆ విధంగా ఏకంగా 23 వేల మంది వివరాలు తప్పుడుగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో తప్పుడు వివరాలతో నమోదు చేసుకున్నారు. ఆ చిరునామాలకు తనిఖీలకు వెళ్లగా అక్కడ ఆయా పేర్లతో ఎవరూ లేరని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
బెంగళూరు సరిహద్దు జిల్లాల్లో 69,297 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వారిలో కేవలం 46,113 మంది మాత్రమే సరైన చిరునామా వివరాలు ఇచ్చారు. మిగతా 23,184 మంది తప్పుడు వివరాలు ఇచ్చారు. దీంతో వారిని వెతికి పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. వలంటీర్ల సాయంతో ప్రయత్నం చేసినా ఫలితం ఉండడం లేదు. బెంగళూరు లాక్డౌన్కు కూడా ప్రధాన కారణం ఇదేనని అధికారులు భావిస్తున్నారు.