భాగ్యనగర బోనాలకు కరోనా ఎఫెక్ట్..ఈ నెల 25 నుంచి ఉత్సవాలు..?
కరోనా వైరస్ వ్యాప్తి అన్లాక్ 1.0 నేపథ్యంలో విస్తృతమవుతోంది. అన్నీ తెరవడంతో వైరస్ వ్యాప్తిని కూడా తెరిచినట్లయింది. ఇటువంటి తరుణంలో తెలంగాణలో అతిముఖ్యమైన పండుగ ఆషాడ బోనాల వేడుకకు సమయం దగ్గరపడింది. దీంతో ఉత్సవాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది...
కరోనా వైరస్ వ్యాప్తి అన్లాక్ 1.0 నేపథ్యంలో విస్తృతమవుతోంది. అన్నీ తెరవడంతో వైరస్ వ్యాప్తిని కూడా తెరిచినట్లయింది. గతవారం రోజులుగా ప్రతిరోజూ గ్రేటర్ హైదరాబాద్ కేసులు వందమార్కును దాటుతున్నాయి. ఒక్కోరోజు ఈ సంఖ్య 199 దాకా కూడా వెళ్తోంది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున రాకపోకలు మొదలుకావడం, లాక్డౌన్ కారణంగా బ్రేకులు పడ్డ అన్ని వృత్తులు, పరిశ్రమలు, పనులు మళ్ళీ మొదలుకావడంతో.. వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటువంటి తరుణంలో తెలంగాణలో అతిముఖ్యమైన పండుగ ఆషాడ బోనాల వేడుకకు సమయం దగ్గరపడింది. దీంతో ఉత్సవాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సారి బోనాలు, రంగం కార్యక్రమాలు ఉంటాయా లేదా అన్న సందేహాం నెలకొంది.
నగరంలో బోనాల పండుగకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారు. బోనాల ఉత్సవంలో పోతురాజులు ఆటలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో భక్తులు లేకుండా అధికారులు, పూజారులతో కూడిన పదకొండు మంది సభ్యుల బృందం నగరంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించనుంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ సారి బోనాలు నిర్వహించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కోండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, 19న హైదరాబాద్ బోనాలు ఉండవని పేర్కొన్నారు. ఆయా గుడుల పూజారులే అమ్మ వార్లకు బోనాలు సమర్పిస్తారని చెప్పారు.
ఆలయాలు తెరవడానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్ఓపీ)పై అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిచర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి ఆలయాల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని, సోడియం హైపోక్లోరైడ్తో గుడి ఆవరణలో శుద్ధి చేయాలని, ఎంట్రీలోనే శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని, థర్మల్ స్క్రీనింగ్కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం దేవాలయాలు ఓపెన్ కావని చెప్పారు.