కరోనా సోకిన వారిలో పలు సైడ్ ఎఫెక్ట్లు.. వెల్లడించిన శాస్త్రవేత్తలు
కరోనాను అరికట్టేందుకు ఓ వైపు ప్రపంచమంతా అష్టకష్టాలు పడుతుంటే.. ఆ వైరస్ గురించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనాను అరికట్టేందుకు ఓ వైపు ప్రపంచమంతా అష్టకష్టాలు పడుతుంటే.. ఆ వైరస్ గురించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ సోకిన రోగుల్లో పలు రకాల మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు లండన్ పరిశోధకులు వెల్లడించారు. ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన కథనం ప్రకారం.. కరోనా సోకిన వారిలో గందరగోళం, స్ట్రోక్, మెదడు వాపు, వెన్నెముక, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా రావొచ్చని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురయ్యారని.. ఇవి అరుదుగా కనిపించే సమస్యలు అయినప్పటికీ, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని లివర్పూల్ విశ్వవిద్యాలయం అధ్యయన శాస్త్రవేత్త సుజన్నా లాంత్ తెలిపారు.
ముఖ్యంగా బాధితుల మెదడులో ఇన్ఫెక్షన్ లేదా వాపు ముప్పు వచ్చే అవకాశం ఎక్కువని.. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు గుర్తించాల్సిన అవసరం ఉందని మరో శాస్త్రవేత్త అవా ఈస్టన్ పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి సమస్యలున్నా, దీనిపై సమగ్ర వివరాలు తమకు అందలేదని ఆయన చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డేటాను సమీక్షిస్తే.. ఈ అంశంపై పూర్తి అవగాహన వస్తుందని వివరించారు.