ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు…కండక్టర్లకు అభయం…
కరోనా వేళ ఏపీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత కొంతకాలంగా కండక్టర్లు లేకుండా బస్సులు నడిపే విధానాన్ని ఉపసంహరించుకుంది. గతంలోలాగానే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను కండక్టర్లతోనే నడపనుంది.
కరోనా వేళ ఏపీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత కొంతకాలంగా కండక్టర్లు లేకుండా బస్సులు నడిపే విధానాన్ని ఉపసంహరించుకుంది. గతంలోలాగానే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను కండక్టర్లతోనే నడపనుంది. కండక్టర్లను కొనసాగిస్తూనే.. డిజిటల్ లావాదేవీలు ఎంకరేజ్ చేసేలా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటి వరకు డిపోలకే పరిమితమైన ఏసీ బస్సులను సైతం రోడ్డెక్కనున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా బస్సుల్లో నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.
కాగా కండక్టర్లు లేకుండా బస్సులు నడపే విధానాన్ని గత ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రవేశపెట్టారు. ఈ పద్దతిని పక్కన పెట్టాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించడంతో..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కండక్టర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుంవడా ఉండేందుకు.. వారు లేకుండానే బస్సులను తిప్పాలని మే నెలలో నిర్ణయించారు. దీంతో కండక్టర్లు బస్టాప్లు, రిజర్వేషన్ సెంటర్స్ వద్ద ఉంటూ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. దీన్ని శాశ్వతంగా అమలు చేసేలా ఆర్టీసీ ఆలోచనలు చేయడంతో.. కార్మిక వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం విరుగుడు చర్యలు చేపట్టింది. కండక్టర్ల సేవలను వినియోగించుకుంటూనే డిజిటల్ లావాదేవీలు పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించింది. ఇకపై ఆన్లైన్ మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ టికెట్ల జారీ సేవలను పెంచనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 55 ఏళ్లపైన ఉన్న సిబ్బందిని వీలైనంత వరకు ఆఫీసుల్లోనే వినియోగించుకోనున్నారు. బస్సు సర్వీసులను సైతం పెంచాలన్న ఆర్టీసీ నిర్ణయంతో ఏసీ బస్సులు సైతం ఇకపై రోడ్డెక్కించనున్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లో సిటీ సర్వీసులు తిప్పేందుకు మరికొంత కాలం ఆగనున్నారు.