ఏడేళ్ల బాలుడికి కరోనా
ఒక్కరోజే రాష్ట్రంలో 61 పాజిటివ్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 592కి చేరింది. తాజాగా ఏడేళ్ల బాలుడికి కరోనా సోకింది...
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే రాష్ట్రంలో 61 పాజిటివ్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 592కి చేరింది. తాజాగా ఏడేళ్ల బాలుడికి కరోనా సోకింది.
హైదరాబాద్లో ఏడేళ్ల బాలుడికి కరోనా సోకింది. అమీన్పూర్కు చెందిన వ్యక్తి గత నెల స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్థకు చెందిన అతిథి గృహంలో 14 రోజులపాటు క్వారంటైన్లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలడంతో ఇంటికి వెళ్లాడు. ఈ నెల 5, 6 తేదీల్లో అతడి ఏడేళ్ల కుమారుడు జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానించి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చిన్నారితోపాటు, అతడి తండ్రిని కూడా అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలోని మిగతా నలుగురి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం వారందరినీ పటాన్చెరులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.