కరోనా ఎఫెక్ట్: విటమిన్ ట్యాబ్లెట్లకు పెరిగిన గిరాకీ
కరోనాతో పోరాడాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. వైద్యులు, శాస్త్రవేత్తలు అందరూ ఈ విషయాన్నే చెబుతూ వస్తున్నారు.
కరోనాతో పోరాడాలంటే ఇమ్యూనిటీ పవర్(వ్యాధి నిరోధక శక్తి) చాలా అవసరం. వైద్యులు, శాస్త్రవేత్తలు అందరూ ఈ విషయాన్నే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఇమ్యూనిటీ పవర్ కోసం విటమిన్ ట్యాబ్లెట్లను వాడుతున్నారు. దీంతో గత రెండు నెలలుగా వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా విటమిన్ డీ–3 , బీ కాంప్లెక్స్, సీ విటమిన్, పారాసెటిమాల్, అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లను రెండు మూడు నెలలకు సరిపడా కొనుగోలు చేసి చాలా మంది స్టోర్ చేసుకున్నారు. దీంతో ఏపీలో 25 వేలకు పైగా మందుల షాపులుంటే.. 70 శాతం షాపుల్లో ఈ విటమిన్ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్టు తేలింది. ఇక ఇదే అవకాశంగా తీసుకొని కొన్ని చోట్ల ఎక్కువ ధరకు వీటిని అమ్ముతున్నట్లు సమాచారం. మాత్రలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. జింకోవిట్ మాత్రలకూ ఎగబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఊరూపేరూ లేని కంపెనీలు కూడా విటమిన్ మాత్రల్ని తెస్తున్నట్లు ఫార్మసీ యజమానులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే విటమిన్ మాత్రల వలన పెద్దగా ఉపయోగం ఉండదని వైద్యులు చెబుతున్నారు. సహజ సిద్ధంగా తినే ఆహారం నుంచి వచ్చే విటమిన్లే శరీరానికి మంచివని వారు అంటున్నారు. పేషెంట్లు ఆహారం తీసుకోలేరు కాబట్టే వారికి మందులను ఇవ్వాల్సి వస్తుందని.. సాధారణంగా ఉండే వారు మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. పండ్లు, ఆకు కూరల ద్వారా అన్నిరకాల విటమిన్లు లభిస్తాయని వారు అంటున్నారు.