ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు చేరిన కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం గత నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు ఆందోళన కలిగించే అంశం.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్, బ్రెజిల్లోనే రికార్డయ్యాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశం.
కేసులు, మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉన్నది. ఆ దేశంలో 66,75,560 కేసులు నమోదుకాగా, 1,97,643 మంది మరణించారు. భారత్లో 52,14,677 కేసులు, 84,372 మరణాలు, బ్రెజిల్లో 44,55,386 కేసులు, 1,34,935 మరణాలు నమోదయ్యాయి.
తేలికపాటి లక్షణాలు కలిగిన కరోనా ఔట్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు రష్యా ప్రభుత్వం తొలిసారిగా ఆర్ఫామ్ సంస్థకు చెందిన కరోనావిర్ ఔషధానికి అనుమతి ఇచ్చింది. ఇది మరో వారంలో ఆ దేశంలోని మెడికల్ షాపుల్లో విక్రయానికి అందుబాటులోకి రానుంది. అంతకుముందు మేలో అవిఫవిర్ ఔషధానికి కూడా ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండింటినీ ఫావిపిరవిర్ ఆధారంగా అభివృద్ధి చేశారు.
మరోవైపు స్ఫూత్నిక్ వీ పేరిట రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ను తయారు చేసింది. దీని కోసం వివిధ దేశాలు రష్యాతో ఒప్పందం చేసుకుంటున్నాయి. రష్యా అభివృద్ధి చేసిన టీకా సేకరణ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి లోక్సభలో తెలియజేశారు.
ఇక ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 36 టీకాలు వివిధ క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయి. ఇందులో రెండు టీకాలను భారత కంపెనీలకు తయారు చేస్తున్నాయి. ఈ ఏడాది చివరినాటికి విజయవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.