కరోనా మృతుల అంత్యక్రియల్లో అపోహలకు గురికావొద్దు
కరోనా మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసుకోవడానికి బంధువులు, మిత్రులు అపోహలకు గురి కావొద్దని ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.
కరోనా మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసుకోవడానికి బంధువులు, మిత్రులు అపోహలకు గురి కావొద్దని ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనాతో మృతి చెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేయొచ్చని ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కరోనా సమీక్ష అనంతరం మాట్లాడిన ఆయన.. ఒక్కో కరోనా రోగికి భోజనం కోసం రోజుకి రూ.500 చొప్పున వెచ్చిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా కరోనా బాధితులకు ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని తెలిపారు.
రోగులకు ప్రభుత్వ మెనూ అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కరోనా రోగులకు వైద్యం నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మరో మూడు కరోనా ఆసుపత్రులను పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో బెడ్లు పెంచడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా కరోనాపై మృతుల విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, మృతుల లెక్కలు దాచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్దికోసమే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆళ్లనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కరోనాతో చనిపోతే వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం 15వేలు సాయం చేస్తోన్న విషయం తెలిసిందే.
Read This Story Also: 29 యాప్లను తొలగించిన గూగుల్