ఆన్లైన్ క్లాసులు.. జైల్లో సంపాదించిన డబ్బులతో కూతురికి ఫోన్
కరోనా వేళ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసులను చెబుతున్నారు
Ex Prisoner buys phone to Daughter: కరోనా వేళ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసులను చెబుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు లేకనో సిగ్నల్ సరిగా రాకనో చాలా మంది ఆన్లైన్ క్లాసులను వినేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ లేక తన కుమార్తె ఇబ్బందులు పడుతుందని భావించిన ఓ మాజీ ఖైదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జైల్లో తాను సంపాదించిన డబ్బులతో కుమార్తె కోసం ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ఘడ్లోని అమ్దర్హ అనే గ్రామానికి చెందిన ఆనంద్ నగేషియా అనే వ్యక్తి తన బంధువును చంపిన కేసులో 2005లో జైలుకి వెళ్లాడు. ఆ సమయంలో అతడికి ఒక ఏడాది పాప ఉంది. ఇక 15 సంవత్సరాల 5 నెలల పాటు జైలులో శిక్షను అనుభవించిన ఆనంద్.. సత్ర్పవర్తనతో ఇటీవల విడుదల అయ్యారు. ఇక ఇంటికి వచ్చిన తరువాత తన కుమార్తె ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ లేదని తెలుసుకున్న ఆనంద్.. తాను సంపాదించిన డబ్బుతో ఆమెకు ఫోన్ని తీసుకొచ్చాడు.
”ఫోన్ లేక ఆన్లైన్ క్లాస్ల కోసం నా కుమార్తె ఇబ్బంది పడటం గమనించాను. తనకు డాక్టరై అందరికి సేవ చేయాలని కోరిక ఉంది. జైలులో ఉన్నప్పుడు చదువు విలువ నాకు తెలిసొచ్చింది. ఎన్ని కష్టాలు పడైనా నా కుమార్తెను చదవించాలని అప్పుడు తెలుసుకున్నా” అని ఆనంద్ చెప్పుకొచ్చారు. కాగా ఆనంద్ చర్యపై పలువురు అభినందనలు చెబుతున్నారు.
Read More: