టీ-పీసీసీ రేసులో రాములమ్మ..? అందుకేనా.. ఇలా..!

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ.. అలియాస్ విజయశాంతి ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. అవకాశం వస్తే చాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మొన్న ఈటెల రాజేందర్, కేటఆర్‌, హరీష్ రావులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు.. కేసీఆర్ పై కూడా ఫైర్ అయ్యారు. ఈ మధ్య అంతా ట్విట్టర్ వేదికగా రాజకీయాంశాలు లేవనెత్తుతుంటే.. రాములమ్మ మాత్రం ఫేస్‌బుక్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలకు దిగుతోంది. తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు […]

టీ-పీసీసీ రేసులో రాములమ్మ..? అందుకేనా.. ఇలా..!
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 3:08 PM

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ.. అలియాస్ విజయశాంతి ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. అవకాశం వస్తే చాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మొన్న ఈటెల రాజేందర్, కేటఆర్‌, హరీష్ రావులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు.. కేసీఆర్ పై కూడా ఫైర్ అయ్యారు. ఈ మధ్య అంతా ట్విట్టర్ వేదికగా రాజకీయాంశాలు లేవనెత్తుతుంటే.. రాములమ్మ మాత్రం ఫేస్‌బుక్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలకు దిగుతోంది.

తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాములమ్మ. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో జరిగిన శిల్పాల వివాదంలో తనదైన రీతిలో స్పందించారు. ఆలయంలోని శిలలపై కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాలకు చెందిన బొమ్మల్ని చెక్కిన వైనం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విజయ శాంతి. సార్వత్రిక ఎన్నికల ముందు సారు..కారు.. పదహారు.. సర్కారు అంటూ రిథమిక్ నినాదాన్ని అదే పనిగా వినిపించటం వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తనకు అర్థమైందని.. విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేశారు.

పవిత్రమైన యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాల్లో దేవతామూర్తులతోపాటు కేసీఆర్ సార్ బొమ్మను.. కారు గుర్తును.. టీఆర్ఎస్ సర్కారు గుర్తును చెక్కటం ద్వారా.. కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతుందన్నారు. రాజ్యాలు.. రాజులు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్.. తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనల్ని కేసీఆర్ రాజకీయకోణంలో చూసి.. వాటిని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉందన్నారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరి గుట్టను తెలంగాణ ప్రజలు భావిస్తూ.. పవిత్ర క్షేత్రంగా నమ్ముతారని.. అలాంటి క్షేత్రాన్ని తమ రాజకీయ ప్రచారానికి వాడుకోవటం.. ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ తీరుపై మఠాధిపతులు.. పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే యాదాద్రి అంశంపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం కేవలం ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. తాజాగా విజయశాంతి కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రాములమ్మ.. సడన్‌గా ప్రభుత్వం తీరుపై మండిపడుతుండటం వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డికి ఇస్తే.. పార్టీ సీనియర్ల నుంచి వ్యతరేకత వస్తుందన్న వార్తలు అధిష్టానాన్ని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే అదనుగా.. రాములమ్మ పీసీసీ పదవిపై కన్నేశారేమోనన్న వార్తలు వినిపిస్తున్నాయి, అందుకే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు టీఆర్ఎస్‌ పార్టీలో మహిళా మంత్రులు లేకపోవడం.. టీఆర్ఎస్ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పించడం లేదన్న నిందలున్నాయి. అయితే రాబోయే కేబినెట్ విస్తరణలో ఇద్దరు మహిళలకు చోటు లభించబోతుందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ.. రాజ్యాంగ పదవితో పావులు కదిపింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన సౌందరరాజన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒకవేళ పీసీసీ చీఫ్‌గా మహిళను నియమించే విధంగా అడుగులు వేస్తే.. అధికార పార్టీకన్న పీసీసీదే పైచేయి అవుతుందా అన్నది వేచిచూడాలి.