వైఎస్సార్ కంటి వెలుగుకు తేదీలు ఫిక్స్..
కరోనాతో బ్రేకులు పడిన ప్రభుత్వ పథకాలకు వేగం పెంచుతున్నారు ప్రభుత్వ పెద్దలు. డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో తాత్కాలికంగా నిలిపి వేసినా.. అతి త్వరలో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు...
కరోనాతో బ్రేకులు పడిన ప్రభుత్వ పథకాలకు వేగం పెంచుతున్నారు ప్రభుత్వ పెద్దలు. డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో తాత్కాలికంగా నిలిపి వేసినా.. అతి త్వరలో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కళ్లద్దాలు పంపిణీ చేయడానికి, ఇతర సమస్యలకు చికిత్సను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఈ పథకం తొలి దశ గతేడాది అక్టోబర్ 10 వరకు.. రెండవ దశ నవంబర్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమలు చేసింది. ఇప్పటి వరకు 4,450 పాఠశాలల్లో 4,12,301 మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 32,800 విద్యార్దులకు కంటి వ్యాధులు ఉన్నట్లుగా నిర్దారించారు. మళ్లీ కంటి వైద్య నిపుణులు బాధిత విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 13,600 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలను పంపిణీ చేశారు. 2,600 మందికి ఇతర కంటి లోపాలను గుర్తించి చికిత్సను అందించారు. మిగతా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు.
మూడో దశలో భాగంగా 60 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 20 వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. 10 డివిజన్లలో 14,780 మందికి పరీక్షలు నిర్వహించారు. 9,028 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించారు. 4,164 మందికి కంటి ఆపరేషన్లు చేయాలని రెఫర్ చేశారు. ఇప్పటికే 302 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. అయితే కరోనా వైరస్ కారణంగా అప్పట్లో తాత్కాలికంగా పథకం ప్రక్రియను నిలిపి వేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అవ్వాతాతలకు కళ్లద్దాలు అందనున్నాయి. వైద్య నిపుణులు, వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలను అందజేస్తారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను చేయనున్నారు.