మున్సిపాలిటీల ఆదాయంపై సీఎం జగన్ కీలక ప్రకటన
పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన సంస్కరణలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు
పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన సంస్కరణలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలపై మాట్లాడారు. మున్సిపాలిటీల ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని, ఆ డబ్బును స్థానికంగానే ఖర్చు చేస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల ఉద్యోగుల జీతభత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. ఆ దిశగా అడుగులు వేయాలి అని సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఇక శానిటేషన్ బాగుండాలి, వాటర్ అండ్ సీవరేజ్ కూడా పక్కాగా ఉండాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలని సూచించారు. వీధులనూ పరిశుభ్రం చేయాలి, డ్రైనేజీలను తరుచూ క్లీన్ చేయాలన్నారు. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలి అని అన్నారు. ఎస్ఓపీ రూపొందించాలన్నారు. మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వాటి వ్యయం ఎంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అభివృద్ధి పనులకు ఎంత వ్యయం చేస్తున్నారు? వంటి అన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్ఓపీ రూపొందించండి అని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.