సీఎం జగన్ కీలక నిర్ణయం..నేరుగా రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ పథకం నగదు
ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ కీలక కామెంట్స్ చేశారు. రైతుకు మేలు చేకూర్చిన మొదటి నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్ను గతంలో అనేకమంది ఎగతాళి చేశారని గుర్తుచేశారు. 104, 108 వాహనాలను ప్రవేశపెట్టి వైఎస్ఆర్ ఎంతో మంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. బోధన ఫీజుల చెల్లింపు, జలయజ్ఞం అంటే వైఎస్సాఆర్ మాత్రమే గుర్తుకువస్తారని తెలిపారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం కూడా రైతులకు పక్షపాతిగా ఉంటుందని జగన్ వెల్లడించారు. సున్నావడ్డీ పథకం కింద నగదును ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. ఉచిత విద్యుత్ రూపంలో ఒక్కో రైతుకు ఏటా 50 వేల రూపాయల లబ్ది చేకూరుతుందని వివరించారు.
ఈ అక్టోబరులోగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం రివ్యూ చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం అన్నది గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు. మొత్తం 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని.. నాలుగైదు రోజులు ఆలస్యమైనా రైతులు కంగారుపడ వద్దని జగన్ కోరారు.