అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించాలి: ప్రధానికి సీజేఐ లేఖ
అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఎస్ఎన్ శుక్లాను తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కేంద్రానికి లేఖ రాశారు. అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఆయన్ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. జస్టిస్ శుక్లాపై 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. […]
అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఎస్ఎన్ శుక్లాను తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కేంద్రానికి లేఖ రాశారు. అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఆయన్ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
జస్టిస్ శుక్లాపై 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. జస్టిస్ శుక్లాపై ఆరోపణల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీకే జైస్వాల్లతో అంతర్గత కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ శుక్లాపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కమిటీ తన విచారణ నివేదికలో స్పష్టం చేసింది. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ జస్టిస్ శుక్లా రాజీనామా చేయాలని, లేదంటే స్వచ్ఛంద పదవీవిరమణను ఎంచుకోవచ్చని సూచించారు. అందుకు జస్టిస్ శుక్లా తిరస్కరించారు. దాంతో, జస్టిస్ దీపక్ మిశ్రా వెంటనే అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి జస్టిస్ శుక్లాకు కోర్టు సంబంధమైన పనులను ఉపసంహరించాల్సిందిగా సూచించారు. ఈ పరిణామంతో శుక్లా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి తొలగింపునకు సీజేఐ రాష్ట్రపతి లేదా ప్రధానికి లేఖ రాసిన పక్షంలో ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ సంఘం ఏర్పాటవుతుంది.