మహారాష్ట్రలో నడుస్తున్నది ‘సర్కస్ ప్రభుత్వం’….రాజ్ నాథ్ సింగ్ ఫైర్
మహారాష్ట్రలో శివసేన ఆధ్వర్యాన 'సర్కస్' పేరిట ఓ ప్రభుత్వం నడుస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఆ రాష్ట్రంలో పాలన బదులు ఈ వినోద కార్యక్రమం..
మహారాష్ట్రలో శివసేన ఆధ్వర్యాన ‘సర్కస్’ పేరిట ఓ ప్రభుత్వం నడుస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఆ రాష్ట్రంలో పాలన బదులు ఈ వినోద కార్యక్రమం కనిపిస్తోందన్నారు. కరోనా వైరస్ ని అదుపు చేయడంలో సర్కార్ విఫలమైందని, ఎన్సీపీ నేత శరద్ పవార్ వంటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ.. రాష్ట్రం మందగతిన నడుస్తోందని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ కార్యకర్తల వర్చ్యువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. వలస కార్మికుల పట్ల సినీ నటుడు సోను సూద్ చేస్తున్న కృషిని ఈ ప్రభుత్వం తప్పు పట్టడం శోచనీయమన్నారు. సోను సూద్ ఉదారతను ప్రశంసించే బదులు ఇక్కడి సర్కార్ ఆయనను విమర్శించడమేమిటని రాజ్ నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఓ కరోనా రోగి అంబులెన్స్ కోసం సుమారు 16 గంటలు వేచి చూశాడంటే అసలు ఇక్కడ ప్రభుత్వమనేది ఉందా అని కూడా ఆయన ధ్వజమెత్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని యూపీ, కర్నాటక రాష్ట్రాలు ఎలా అదుపు చేస్తున్నాయో చూసి నేర్చుకోవాలని ఆయన మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.