దుబాయ్లో తెలంగాణవాసి కష్టాలు
బతుకు దెరువు కోసం దేశం విడిచి పోయాడు. అంతలోనే మాయదారి రోగంతో ఉన్న తావునే మరచిపోయాడు. ఇటు సొంతూరు చేరలేక అయినవారు కానరాక ఆ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. తీరా ఓ స్వచ్చంధ సంస్థ అతన్ని గుర్తించి ఇంటి చేరుదామంటే దౌత్య నిబంధనలు అడ్డుపడుతున్నాయి. మానసికస్థితి సరిగా లేని తన భర్తను స్వదేశానికి రప్పించాలని ఆ ఇల్లాలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.
బతుకు దెరువు కోసం దేశం విడిచి పోయాడు. అంతలోనే మాయదారి రోగంతో ఉన్న తావునే మరచిపోయాడు. ఇటు సొంతూరు చేరలేక అయినవారు కానరాక ఆ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. తీరా ఓ స్వచ్చంధ సంస్థ అతన్ని గుర్తించి ఇంటి చేరుదామంటే దౌత్య నిబంధనలు అడ్డుపడుతున్నాయి. మానసికస్థితి సరిగా లేని తన భర్తను స్వదేశానికి రప్పించాలని ఆ ఇల్లాలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమన్పల్లికి చెంది న నీల ఎల్లయ్య 16 ఏండ్లు క్రితం దుబాయ్లో బతుకు దెరువు వెతుక్కుంటూ వెళ్లాడు. 2004లో విజిట్ వీసాపై దుబాయ్ వెళ్లిన ఈయన భవన నిర్మాణ కూలీగా పనిచేశాడు. కొంతకాలం తరువాత తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి బయటికి వచ్చేశాడు. ఇంతలో దుబాయ్లో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపే కార్యక్రమం మొదలు పెట్టారు అక్కడి అధికారులు. 2007 సంవత్సరంలో ఎల్లయ్య పాస్పోర్టును అక్కడి అధికారులకు అప్పగించాడు. కొన్ని నెలల తరువాత మానసికస్థితి సరిగాలేకపోవడంతో ఎల్లయ్య తాను ఉంటున్న చోటునుంచి వెళ్లిపోయాడు.
ఇదిలావుంటే, దుబాయ్, షార్జా ప్రాంతాల్లో కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు జైన్ సేవా మిషన్ వలంటీర్ రూపేష్మెహతా అండగా నిలిచారు. ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఎల్లయ్య దయనీయ స్థితిని గమనించి వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే ఇండియన్ కాన్సులేట్ ద్వారా ఎల్లయ్యకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇప్పించి స్వదేశానికి పంపించడానికి రూపేష్మెహతా ప్రయత్నించారు. ఎల్లయ్య 16 ఏండ్ల క్రితం దుబాయ్లోకి ప్రవేశించిన ఎల్లయ్య పాస్పోర్టు వివరాలు సమర్పిస్తేనే తాత్కాలిక పాస్పోర్టు జారీ చేయడానికి వీలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎల్లయ్య దగ్గర ఏ ఆధారాలు లేకపోవడంతో ఆయన తెలంగాణలోని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ సహకారాన్ని కోరారు. గత నెల 27న ప్రవాసిమిత్ర ప్రతినిధులు ఎల్లయ్య పాస్పోర్టు వివరాలు అందజేయాలని కోరుతూ అతడి భార్య నీల రాజవ్వతో హైదరాబాద్లోని పాస్పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేయించారు. తన భర్త పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి వేడుకుంటోంది భార్య రాజవ్వ. ప్రభుత్వం, అధికారులు స్పందించి తన భర్తను వెంటనే స్వదేశానికి రప్పించాలని రాజవ్వ కోరుతుంది.