ఒంగోలు దగ్గరి బీచ్లో చైనీస్ సిలిండర్.. భయంలో జనం
చైనా నుంచి సముద్రంలో కొట్టుకొచ్చిన ఓ వస్తువు ఏపీ తీరప్రాంతంలో భయాందోళన సృష్టించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి సమీపంలోని ఓ బీచ్లో ఈ చైనా వస్తువు కలకలం సృష్టించింది. అదేంటో తేల్చేందుకు మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ సముద్ర తీరంలోని బీచ్లోకి ఓ సిలిండర్ ఆకారంలో ఉన్న వస్తువు కొట్టుకొచ్చింది. ఈ వస్తువు చైనాది కావడంతో బీచ్ సమీప ప్రాంతంలో నివసించే జనం భయాందోళనతో బెంబేలెత్తిపోయారు. ఈ సిలిండర్ ఆకారపు వస్తువుపై చైనా లిపిలో అక్షరాలు ఉండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు వస్తువును పరిశీలించి అగ్నిమాపక యంత్రంగా నిర్ధారించారు. కాని ఇది ఇక్కడికి ఎలా వచ్చింది, దేనికి సంబంధించినదో విచారణలో తేలాల్సి ఉందంటున్నారు. ఈ వస్తువు గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఉపయోగించే యంత్రంగా గుర్తించినట్టు మెరైన్ ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
అనంతరం గ్రామ విఆర్ఓకు ఆ వస్తువుని అప్పగించారు. కొట్టుకొచ్చిన వస్తువుపై చైనా బాష ఉండటం, తరచూ ఇటువంటి గుర్తుతెలియని వస్తువులు సముద్రంలో కొట్టుకు రావడం పట్ల తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.