మళ్ళీ కవ్వింపు.. లడఖ్ గగనతలంలో ఎగిరిన చైనా హెలికాఫ్టర్స్
ఉత్తర సిక్కింలో ఇటీవల చైనా, భారత దళాల మధ్య జరిగిన ఘర్షణ, రాళ్ళ దాడుల ఘటన మరువక ముందే.. ఆ దేశం మళ్ళీ మన దేశాన్ని కవ్వించిన ఘటన.. ఆందోళనకు దారి తీస్తోంది.
ఉత్తర సిక్కింలో ఇటీవల చైనా, భారత దళాల మధ్య జరిగిన ఘర్షణ, రాళ్ళ దాడుల ఘటన మరువక ముందే.. ఆ దేశం మళ్ళీ మన దేశాన్ని కవ్వించిన ఘటన.. ఆందోళనకు దారి తీస్తోంది. లడఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా ఉద్రిక్త పరిస్థితులను సృష్టించేందుకు చైనా యత్నిస్తోంది. అక్కడ ఈ రేఖకు అతి దగ్గరగా చైనా సైనిక హెలికాఫ్టర్లు ఎగరడాన్ని భారత దళాలు గమనించాయి. నార్త్ సిక్కింలో ఉభయ దేశాల సైనికుల మధ్య ఘర్షణ సమయంలోనే ఈ సంఘటన కూడా జరగడం గమనార్హం. చైనా చాపర్లను చూసిన భారత వైమానిక దళ జెట్ ఫైటర్లు అక్కడికి చేరుకున్నాయని, సమయం లభిస్తే ఏదో ఒక చర్యకు దిగేందుకు సమాయత్తమయ్యాయని తెలిసింది. అయితే చైనా చాపర్లు భారత భూభాగంలోకి ప్రవేశించలేదు. ఇతర విమానాలతో బాటు లడఖ్ లోని లేహ్ ఎయిర్ బేస్ నుంచి తరచూ సుఖోయ్ యుధ్ధ విమానాలు ఎగురుతుంటాయి. ఇండియాతో గల తూర్పు సరిహద్దుల్లో ముఖ్యంగా రాత్రివేళల్లో పాకిస్తాన్ తన యుధ్ధ విమానాలను పంపుతుంటుందని, గగనతలంలో ఎగిరే వీటిని భారత జవాన్లు గమనించారని సైనిక వర్గాలు తెలిపాయి. చూడబోతే పాక్, చైనా వేర్వేరుగానో, కలిసికట్టుగానో భారత్ ను ఇరకాటాన బెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. గతంలో చైనా మిలిటరీ హెలికాఫ్టర్లు చాలాసార్లు లడఖ్ సెక్టార్ లో ప్రవేశించి వెనుదిరిగాయి.
కోవిడ్-19 ఔట్ బ్రేక్ మొదలైనప్పటి నుంచి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పై అక్కడి ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. వూహాన్ సిటీ నుంచి కరోనా వైరస్ పుట్టిందని అమెరికా సహా వివిధ దేశాలు చైనాను వేలెత్తి చూపుతుండగా.. దాన్ని ఎదుర్కోవడానికి జిన్ పింగ్ తీసుకుంటున్న చర్యల పర్యవసానం ఎలా ఉన్నా, అమెరికా-భారత్ దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం పట్ల చైనా లోలోపల మండిపడుతోంది. బహుశా ఇందుకే సిక్కింలో, అనంతరం లడఖ్ లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి మెల్లగా కయ్యానికి కాలు దువ్వుతోంది.