హాంకాంగ్ పై చైనా-బ్రిటన్ జగడం…మళ్ళీ ఆందోళనలు
హాంకాంగ్ విషయంలో చైనా-బ్రిటన్ మధ్య జగడం ప్రారంభమైంది. హాంకాంగ్ వాసుల్లో దాదాపు 30 లక్షల మందికితమ దేశంలో పౌరసత్వం కల్పిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇఛ్చిన ఆఫర్ పట్ల చైనా మండిపడింది. పైగా బ్రిటన్..
హాంకాంగ్ విషయంలో చైనా-బ్రిటన్ మధ్య జగడం ప్రారంభమైంది. హాంకాంగ్ వాసుల్లో దాదాపు 30 లక్షల మందికితమ దేశంలో పౌరసత్వం కల్పిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇఛ్చిన ఆఫర్ పట్ల చైనా మండిపడింది. పైగా బ్రిటన్ మంత్రి డొమినిక్ రాబ్ కూడా దీనిపై అధికారిక ప్రకటన చేయడంతో బీజింగ్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బ్రిటన్ పై ప్రతీకార చర్యలు చేపడతామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ హెచ్చరించారు. బ్రిటన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని, హాంకాంగ్ వ్యవహారాలు తమ దేశానికి సంబంధించినవని పేర్కొన్న ఆయన.. ఇందులో మరే ఇతర దేశమూ జోక్యం చేసుకోజాలదన్నారు. లండన్ లోని బీజింగ్ ఎంబసీ.. ఈ ‘ఆఫర్’ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని ఆరోపించింది.
ఇలా ఉండగా మళ్ళీ భారీ ఎత్తున నిరసనలకు పాల్పడిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పెప్పర్ స్ప్రే చల్లారు. వందలాది మందిని అరెస్టు చేశారు. హాంకాంగ్ కి స్వేఛ్చ కల్పించాలని ఓ పతాకాన్ని పట్టుకున్న 15 ఏళ్ళ బాలికను కూడా వారు అరెస్టు చేశారు. అటు-ఓ పోలీసు భుజంపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ఓ యువకుడు పారిపోతుండగా నిరసనకారులు అడ్డుకోలేదు.. అనేక చోట్ల పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి. చైనా ఆధిపత్యాన్ని తాము సహించేది లేదని హాంకాంగ్ వాసులు ఇప్పటికీ ప్రకటిస్తున్నారు.