చైనా.. నాసిరకానికి చిరునామా
కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రెండ్రోజుల పాటు ఉపయోగించవద్దని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశించింది. రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఉన్నతాధికారి గంగాఖేద్కర్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్ర ప్రభుత్వ కోవిడ్-19 సాధికార కమిటీ నిర్వహించిన మీడియా సమావేశంలో గంగాఖేద్కర్ ఈ వివరాలు వెల్లడించారు. అంతకంటే […]
కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రెండ్రోజుల పాటు ఉపయోగించవద్దని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశించింది. రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఉన్నతాధికారి గంగాఖేద్కర్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్ర ప్రభుత్వ కోవిడ్-19 సాధికార కమిటీ నిర్వహించిన మీడియా సమావేశంలో గంగాఖేద్కర్ ఈ వివరాలు వెల్లడించారు. అంతకంటే ముందు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరుపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఐసీఎంఆర్కు లేఖ రాసింది. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఉపయోగించి నిర్వహించిన కరోనా టెస్టుల్లో కేవలం 5.4 శాతం మాత్రమే కచ్చితత్వం వచ్చిందని, 94.6 శాతం ఫలితాల్లో కచ్చితత్వం లేదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి దాదాపు ఇదే తరహా ఫిర్యాదులు వచ్చాయి. తమ రాష్ట్రంలో కరోనా బాధితులకు వైద్యం అందించే క్రమంలో కరోనా తగ్గిందో లేదో తెలుసుకునేందుకు ర్యాపిడ్ కిట్ల ద్వారా రీ టెస్టులు చేశామని, ఫలితాలు సరిగా రాలేదని వెల్లడించింది. దీంతో కిట్లు సరిగా పనిచేయడం లేదని ఆ రాష్ట్రం కూడా ఐసీఎంఆర్ దృష్టికి తీసుకొచ్చింది. నిజానికి గత వారం కేంద్ర ప్రభుత్వం చైనా నుంచి 5 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసి, కరోనా విస్తృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు పంపిణీ చేసింది. వాటి ద్వారా పరీక్షలు నిర్వహించే క్రమంలో కచ్చితత్వంపై సందేహాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ తాజా నిర్ణయం తీసుకుంది. 8 నిపుణుల బృందాలను రాష్ట్రాలకు పంపించి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల నాణ్యత, పనితీరును పరీక్షిస్తామని ఐసీఎంఆర్ అధికారి గంగాఖేద్కర్ తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,49,810 కరోనా పరీక్షలు నిర్వహించామని, సోమవారం ఒక్క రోజే 35,852 నమూనాలను పరీక్షించామని తెలిపారు.
చైనా అంటేనే నాసిరకం వస్తువులకు పెట్టింది పేరు. చైనా నాసిరకాన్ని వర్ణిస్తూ వచ్చిన వ్యంగ్య, హాస్య కథనాలకు కూడా కొదవలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తీస్తున్న మహమ్మారి కరోనా విషయంలోనూ చైనా ఏమాత్రం నాణ్యతను పాటించలేదని తెలుస్తోంది. కరోనా టెస్టుల కోసం ఆ దేశం ఎగుమతి చేసిన టెస్టు కిట్ల పనితీరుపై కేవలం భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ అనేక సందేహాలున్నాయి. యూకేకు పంపించిన కిట్లు పూర్తి లోపభూయిష్టంగా ఉన్నాయని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే కరోనా టెస్టు కోసం ప్రస్తుతం ఐసీఎంఆర్ ఆమోదించిన పీసీఆర్ (పాలిమరేజ్ చైన్ రియాక్షన్) విధానం ద్వారా పరీక్షించడానికి ఎక్కువ సమయం పడుతుంది. వ్యక్తి శరీరంలోని గొంతు, ముక్కు నుంచి స్వాబ్ ద్వారా నమూనాలు సేకరించి పరీక్షించడం ద్వారా కరోనా ఉందా లేదా అన్నది నిర్థారణ జరుగుతుంది. ఇందులో కచ్చితత్వం ఉంటుంది. అయితే సిబ్బంది సంఖ్య, పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుంటే ఒక్కో పరీక్షకు కనీసం 5 గంటల నుంచి ఒక రోజు వరకు పడుతుంది. అదే ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా జరిపే పరీక్ష ఫలితం 15-30 నిమిషాల్లో వచ్చేస్తుంది. వ్యక్తి శరీరం నుంచే సేకరించే రక్త నమూనా ద్వారా నిర్వహించే ఈ పరీక్షా విధానంతో తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా టెస్టులు నిర్వహించే అవకాశం ఉంటుంది. పైగా ఇది ప్రారంభ దశలో శరీరంలో వైరస్ను గుర్తించడానికి తోడ్పడుతుంది. అయితే ఈ తరహా కిట్లను ప్రస్తుతం భారతదేశంలో బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లోని మెడిటెక్ జోన్లలో తయారు చేస్తున్నారు. వాటి పనితీరు, నాణ్యతను పరీక్షించి ఆమోదించిన తర్వాతనే వినియోగంలోకి వస్తాయి. ఈలోపు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న దేశాల నుంచి దిగుమతి ప్రారంభించింది. ఆ క్రమంలో చైనా నుంచి 5 లక్షల కిట్లు గతం వారం భారతదేశానికి చేరుకున్నాయి. వాటిని వివిధ రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేయగా, ఇప్పుడు ఆ కిట్ల పనితీరే అనేక సందేహాలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాలు దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకున్నాయి. అమెరికా నుంచి కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం చైనా కిట్ల పనితీరుపై నెలకొన్న సందేహాల నేపథ్యంలో ఐసీఎంఆర్ అన్ని రకాల కిట్లనూ పరీక్షించేందుకు సిద్ధమైంది. పనితీరు, నాణ్యతను పరీక్షించి ఆమోదించిన కిట్లనే వినియోగించేలా తదుపరి మార్గదర్శకాలు రూపొందించనుంది.
మహాత్మ కొడియర్, టీవీ9 ప్రతినిధి