మళ్లీ డ్రాగన్ తప్పుడు పనులు
డ్రాగన్ కంట్రీ డొంక తిరుగుడు పనులు మానుకోవడం లేదు. నియంత్రణ రేఖ నుంచి బలగాల ఉపసంహరణకు ఓ వైపు భారత్తో చర్చలు జరుపుతూనే.. ఉద్రిక్తతలకు తావిచ్చేలా దాయాది దేశం..
డ్రాగన్ కంట్రీ డొంక తిరుగుడు పనులు మానుకోవడం లేదు. నియంత్రణ రేఖ నుంచి బలగాల ఉపసంహరణకు ఓ వైపు భారత్తో చర్చలు జరుపుతూనే.. ఉద్రిక్తతలకు తావిచ్చేలా దాయాది దేశంతో ప్రవర్తిస్తోంది. లడఖ్ సరిహద్దుల్లో భారీగా బలగాలు, హెలికాఫ్టర్లను మోహరించిన డ్రాగన్… సరిహద్దుల వెంబడి సైనిక కార్యకలాపాలను మళ్లీ ముమ్మరం చేస్తోంది. గతంలో ఇరు దేశాలు తలపడ్డ డోక్లాం తోపాటు నాకులా క్లాష్ పాయింట్కు అత్యంత చేరువలో మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చైనా నిర్మిస్తోంది. అంతేకాదు.. ఎల్ఏసీ వెంబడి ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ వేయడంతోపాటు.. 5 జీ పరికరాలను చైనా ఏర్పాటు చేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
లడఖ్లోని పాంగాంగ్ సరస్సు సమీపంలో బారాక్లు, ఇతర నిర్మాణాలను కూడా డ్రాగన్ కంట్రీ చేపడుతోంది. డోక్లాంలో.. చైనా, భూటాన్, భారత్ ట్రై జంక్షన్ వద్ద మిస్సైల్ సైట్స్ను ఏర్పాటు చేస్తోందని సమాచారం. ఇరు దేశాల సైన్యం 2017లో ఘర్షణకు దిగిన ఇదే ప్రాంతానికి 50 కి.మీ. దూరంలోనే చైనా ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. చైనా పనులన్నింటినీ భారత్ ఓ కంట కనిపెడుతోంది. సరిహద్దుల్లో చైనా అడుగుజాడలపై భారత్ సైన్యం నిఘా పెట్టింది. డెట్రెస్ఫా అనే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ కూడా డ్రాగన్ నిర్మాణాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలను బయటపెట్టింది.