ఇడ్లీ బాగులేదన్న చిన్నారిని కొట్టి చంపిన పెద్దమ్మ

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇడ్లీ తినలేదని ఐదేళ్ల బాలికను హతమార్చింది పెద్దమ్మ. ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

ఇడ్లీ బాగులేదన్న చిన్నారిని కొట్టి చంపిన పెద్దమ్మ
Follow us

|

Updated on: Sep 10, 2020 | 9:16 AM

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇడ్లీ తినలేదని ఐదేళ్ల బాలికను హతమార్చింది పెద్దమ్మ. ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపం మెల్‌విళి గ్రామానికి చెందిన రోసారియో, జయరాణి దంపతుల కుమార్తె రెన్సీమేరీ (5). మూడేళ్ల క్రితం జయరాణి మృతిచెందడంతో రోసారియో మరో మహిళను వివాహం చేసుకొని వేరు కాపురం పెట్టాడు. చిన్నారి రెన్సీమేరీ తన అమ్మమ్మ అయిన జయరాణి తల్లి పచ్చయమ్మాళ్‌ ఇంట్లో ఉంటోంది. అక్కడే జయరాణి అక్క ఆరోగ్యమేరీ కూడా ఉంటుంది. ఆరోగ్యమేరీకి ఇంకా వివాహం కాలేదు.

అయితే, ఈ క్రమంలో సోమవారం ఉదయం రెన్సీమేరీని ఇడ్లీ తినమని ఆరోగ్యమేరీ కోరగా, అవి బాగా లేవని, నాకు వద్దంటూ బాలిక బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లింది. దీంతో ఆగ్రహించిన ఆరోగ్యమేరీ స్నేహితులతో ఆడుకుంటున్న రెన్సీమేరీని చావబాదుతూ ఇంట్లోకి తీసుకొచ్చి, తలుపులు మూసి కర్రతో తీవ్రంగా కొట్టిందని స్థానికులు తెలిపారు. బాలిక కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని రెన్సీమేరీని రక్షించి త్యాగదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం బాలికను కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై త్యాగదుర్గం పోలీసులు కేసు నమోదుచేసి ఆరోగ్యమేరీని అరెస్టు చేసి జైలుకు తరలించారు.