Governor’s role నిన్న జగన్.. నేడు కేసీఆర్… గవర్నర్లతో భేటీ వెనుక మేటర్ ఇదే
మంగళవారం సాయంత్రం.. ఉన్నట్లుండి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజ్ భవన్కు వెళ్ళి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. 24 గంటలు తిరక్కముందే తెలంగాణలో అదే సీన్ పునరావృతం అయ్యింది
Telugu states Governor’s playing crucial role: మంగళవారం సాయంత్రం.. ఉన్నట్లుండి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజ్ భవన్కు వెళ్ళి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. 24 గంటలు తిరక్కముందే తెలంగాణలో అదే సీన్ పునరావృతం అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్ బాట పట్టారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సమావేశమయ్యారు. ఇంతకీ ముఖ్యమంత్రులిద్దరు గవర్నర్లను కలవడం వెనుక కథేంటన్న చర్చ మొదలైంది తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో.
మంగళవారం ఉదయమే యావత్ భారత్ దేశం ఉలిక్కి పడింది. కరోనా వైరస్ వ్యాప్తి కాస్త కుదురుకుంటుందన్న సంకేతాలను ముఖ్యమంత్రులిద్దరు ఇచ్చిన 24 గంటలు తిరక్క ముందే ఢిల్లీ నుంచి కరోనాను మోసుకొచ్చిన ఓ వర్గం జనం… కరోనా థ్రెట్ ఇప్పుడప్పుడే తొలగిపోదన్న షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం రోజంతా ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సాయంత్రానికి గవర్నర్ దగ్గరికి ప్రయాణమయ్యారు.
మంగళవారం ఒక్కరోజే ఆరుగురు కరోనాతో మృతి చెందడం, ఢిల్లీ నుంచి కరోనా వైరస్ను మోసుకొచ్చిన వారు ఇంకా ట్రేస్ కాకపోవడంతో బుధవారం అంతా సమీక్షలతో బిజీబిజీగా గడిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సాయంత్రానికి ఆయనా గవర్నర్ దగ్గరికి ప్రయాణమయ్యారు. తీసుకుంటున్న చర్యలపైనా, తాజా పరిస్థితిపైనా ఆయన గవర్నర్కు బ్రీఫింగ్ ఇచ్చారు.
ముఖ్యమంత్రులిద్దరి రాజ్భవన్ సందర్శన వెనుక కారణాలను విశ్లేషిస్తే.. కేంద్ర హోం శాఖ తాజాగా చేసిన హెచ్చరికలేనని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు హాజరైన వారి లక్ష్యం ఏంటన్నది ఇందులో కీలకాంశం. ఇదంతా సహజంగానే జరిగిందా ? లేక ఏమైనా కుట్ర కోణం వుందా ? అనే కోణంలో కేంద్ర హోం శాఖ పరిశోధన చేయిస్తోంది. ఇందుకు జాతీయ నిఘా సంస్థలతోపాటు రాష్ట్రాల నిఘా సంస్థల ఇన్పుట్స్ సేకరిస్తోంది కేంద్ర హోం శాఖ. ఇందులో భాగంగానే గవర్నర్లకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను హోం శాఖ జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ అన్ని అంశాలపై కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే కరోనా వైరస్ను నియంత్రించడంతోపాటు సంఘ వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాల కోణం ఏమైనా వుంటే తగిన విధంగా స్పందించేందుకు అవకాశం వుంటుందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. ఇందులో గవర్నర్ల పాత్రతోపాటు.. రాష్ట్రాల పోలీసు బాసుల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులిద్దరు గవర్నర్తో భేటీ అయ్యారని తెలుస్తోంది. గవర్నర్ల ద్వారా తీసుకునే ఫీడ్ బ్యాక్ ఆధారంగా గురువారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ .. దేశంలోని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.