చార్మినార్‌కు కొత్త వైభవం రానుందా..?

హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్. నిత్యం దేశ, విదేశీ పర్యాటకులు చార్మినార్‌ను చూడటానికి వస్తుంటారు. భాగ్యనగర నిర్మాత, కుతుబ్‌షాహీ సామ్రాజ్యానికి ఐదో సుల్తాన్ అయిన మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు. అంటే చార్మినార్ నిర్మించి ఇప్పటికి సుమారు 428 సంవత్సరాలు అయిందన్నమాట. అయితే చార్మినార్ నిర్మించడానికి గల కారణాలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కువగా ప్రబలింది. ఆ వ్యాధి పూర్తిగా నయమైన శుభవేళను కలకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో […]

చార్మినార్‌కు కొత్త వైభవం రానుందా..?
Follow us

|

Updated on: Jun 15, 2019 | 11:26 AM

హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్. నిత్యం దేశ, విదేశీ పర్యాటకులు చార్మినార్‌ను చూడటానికి వస్తుంటారు. భాగ్యనగర నిర్మాత, కుతుబ్‌షాహీ సామ్రాజ్యానికి ఐదో సుల్తాన్ అయిన మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు. అంటే చార్మినార్ నిర్మించి ఇప్పటికి సుమారు 428 సంవత్సరాలు అయిందన్నమాట. అయితే చార్మినార్ నిర్మించడానికి గల కారణాలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కువగా ప్రబలింది. ఆ వ్యాధి పూర్తిగా నయమైన శుభవేళను కలకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో చార్మినార్‌ నిర్మాణం జరిగిందని కొందరు చెబితే.. కుతుబ్‌షాహీ పాలకుల విజయ వైభవానికి ప్రధాన సింహద్వారంలాగా చార్మినార్‌ నిర్మించారని ఇంకొందరు చెబుతున్నారు. చరిత్ర ఎలా ఉన్నా చార్మినార్‌ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

అంతటి చరిత్ర కలిగిన చార్మినార్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఈ నేపథ్యంలో చార్మినార్ పగుళ్లను సాంకేతిక పరిఙ్ఞానం సాయంతో అధ్యయనం చేస్తున్నారు. ఆధునిక సెన్సర్‌ను ఉపయోగించి శాస్త్రీయంగా వాస్తవాలను గుర్తించే ప్రయత్నం చేశారు. భారతీయ పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గబ్బిబౌలి ప్రాంతానికి చెందిన అంకుర సంస్థ టెర్రా డ్రోన్ ఇండియా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 8 మంది సభ్యులతో కూడిన బృందం చార్మినార్ నిర్మాణాన్ని పూర్తిగా ఎక్స్‌రే తీశారు. 1591లో నిర్మించిన చార్మినార్ కట్టడంలో తరచూ పగుళ్లు ఏర్పడుతున్నాయి. నాలుగు మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపురాయి కట్టడం విరిగి పడిపోయింది. దీంతో కట్టడ సంరక్షణకు భారతీయ పురాతత్వ శాఖ, తెలంగాణ ఐటీ శాఖ సహాయంతో టెర్రా డ్రెన్ ఇండియాకు అధ్యయన బాధ్యతలు అప్పగించారు. డ్రోన్‌ల వినియోగంపై నిషేధం ఉండటంతో సంస్థ అత్యాధునిక సెన్సర్స్, కెమెరాల సాయంతో మినార్ పగుళ్లపై నాలుగు విభాగాల్లో అధ్యయనం చేశారు. త్రీడీ మోడల్ సెన్సార్ సహాయంతో మిల్లీ మీటరు దూరం వరకూ పరిశీలించారు. అసలు రంగు, ముఖభాగం, పగుళ్లను త్రీడీలో చిత్రీకరించారు.

థర్మల్‌స్కానింగ్ పద్దతి ద్వారా కట్టడంలోని వివిధ ప్రదేశాలకు చేరే ఉష్ణోగ్రతలు, వాటి వల్ల జరిగే నష్టాలను అంచనా వేశారు. ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల వల్ల నిర్మాణంలోని ఏయే భాగాలు దెబ్బతింటాయనేది గుర్తించే ప్రయత్నం చేశారు. వాతావరణ మార్పులతో చార్మినార్‌కు ఎలాంటి నష్టం జరుగుతుందనేది దీనిద్వారా శాస్త్రీయంగా గుర్తించే వీలుందంటూ నిపుణులు తెలిపారు. మరమ్మత్తులు, పుననిర్మాణానికి అనువుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఖచ్చితంగా లెక్కకట్టగల సాంకేతిక పరిఙ్ఞానం ఉపయోగించారు.

మొత్తం నాలుగు విభాగాల్లో నిపుణులు తయారు చేసిన నివేదిక, సేకరించిన డేటాను క్రోడీకరించి పూర్తి నివేదికను భారతీయ పురాతత్వశాఖకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. భారతీయులు గర్వించదగిన కట్టడాల్లో ఒకటైన చార్మినార్‌ను సురక్షితంగా ఉంచడంలో సాంకేతిక పరిజ్నానం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.