ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వివరాలివే..
ప్రత్యేక రైళ్లలలో ఏపీకి చేరుకునేవారి ద్వారా వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండేందుకు హల్టింగ్ స్టేషన్ల సంఖ్యను కుదించాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఏపీలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక రైళ్లలో ఏపీకి చేరుకునేవారి ద్వారా వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండేందుకు హల్టింగ్ స్టేషన్ల సంఖ్యను కుదించాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనితో ఎస్సీఆర్ జోన్ అధికారులు ప్రత్యేక రైళ్ల స్టాపుల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రం మీదుగా నడుస్తున్న 22 రైళ్లు ఇప్పటివరకు 70 స్టేషన్లలో ఆగగా.. ఇకపై కేవలం 18 స్టేషన్లకే పరిమితం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇది అమలులోకి రానుంది. విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, మంత్రాలయం రోడ్, గుంతకల్లు, కడప, ఆదోని, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు, కుప్పం, రేణిగుంట, అనకాపల్లి, మంగళగిరి స్టేషన్లలోనే స్పెషల్ ట్రైన్స్ అగనున్నాయి.
ఇక రద్దైన స్టాపుల్లో ఎక్కేందుకు, దిగేందుకు టికెట్లను రద్దు చేసుకున్న ప్రయాణీకులకు డబ్బులు రీఫండ్ చేస్తామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాగా, గోదావరి ఎక్స్ప్రెస్ అనకాపల్లి స్టేషన్లో ఆగనుండగా.. గోల్కొండ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు మంగళగిరి స్టాప్లో ఆగుతుంది.
ఏపీ గుండా వెళ్లే రైళ్లకు రద్దయిన స్టాపుల వివరాలు ఇలా ఉన్నాయి..
- ఫలక్నామా(సికింద్రాబాద్ – హౌరా) – పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం
- ఫలక్నామా(హౌరా -సికింద్రాబాద్) – సామర్లకోట, పలాస, ఇచ్చాపురం
- గోల్కొండ (సికింద్రాబాద్ – గుంటూరు) – కొండపల్లి, రాయనపాడు, కృష్ణా కెనాల్, మంగళగిరి, నంబూరు, పెదకాకాని
- గోల్కొండ (గుంటూరు- సికింద్రాబాద్) – కొండపల్లి, రాయనపాడు, నంబూరు, పెదకాకాని
- రాయలసీమ( తిరుపతి – నిజామాబాద్) – రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లె
- రాయలసీమ( నిజామాబాద్- తిరుపతి ) – రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి
- గోదావరి(హైదరాబాద్ – విశాఖపట్నం) – తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడ
- కోణార్క్(సీఎస్టీ ముంబై – భువనేశ్వర్) – తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్చాపురం
- ఉద్యాన్(సీఎస్టీ ముంబై – కేఎస్ఆర్ బెంగళూరు) – ఆదోని, గుత్తి, ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుగొండ, హిందూపూర్
- సంఘమిత్ర(దానాపూర్ – కేఎస్ఆర్ బెంగళూరు) – గూడూరు, రేణిగుంట
- ఏపీ( విశాఖపట్నం- న్యూఢిల్లీ) – దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, తాడేపల్లిగూడెం
- దురంతో(హౌరా – యశ్వంత్పూర్) – విజయనగరం
Also Read: కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!