కరోనా ఎఫెక్ట్: భక్తులు లేకుండానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. చరిత్రలో తొలిసారి..

వ‌రాహ‌, నా‌ర‌సింహ అవ‌తారాల క‌లియికగా కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం సింహాచలం. ఈ క్షేత్రంలో కొలువున్న శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు.

కరోనా ఎఫెక్ట్: భక్తులు లేకుండానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. చరిత్రలో తొలిసారి..
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 4:57 PM

వ‌రాహ‌, నా‌ర‌సింహ అవ‌తారాల క‌లియికగా కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం సింహాచలం. ఈ క్షేత్రంలో కొలువున్న శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏడాది పొడువునా చందనంతో కప్పి ఉండే స్వామివారు ఈ ఒక్క రోజు మాత్రం నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు సింహగిరికి తరలివస్తారు. అయితే, ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాచడంతో భక్తులకు ఆ భాగ్యం కరువయ్యింది.

కోవిద్-19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా భక్తులను అనుమతించకపోవడంతో కేవలం వైదిక పెద్దల ఆధ్వర్యంలోనే చందనోత్సవం సాగుతోంది. వాస్తవానికి స్వామివారికి చందనం తొలగించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం కేవలం వంశపార ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు.

మరోవైపు.. రాష్ట్రప్రభుత్వం తరపున దేవస్థానం ఈవోనే స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి వైదిక కార్యక్రమాలు, 3.30గంటల నుంచి స్వామివారిపై ఉండే చందనం విసర్జన, మధ్యాహ్నం 3గంటల నుంచి అష్టోత్తర శత కలశ పూజ నిర్వహించారు.

కాగా.. సాయంత్రం 5గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహణ, తదుపరి తొలివిడత చందనం సమర్పణ నిర్వహించనున్నారు. అర్చకులు సహా పరిమిత సిబ్బందితోనే స్వామి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ఘాట్ రోడ్లతోపాటు మెట్ల మార్గాలనూ ఆలయ అధికారులు మూసివేశారు.