రైతుల ఆందోళనలో పురోగతి, రెండ్రోజులు మందుగానే దిగొచ్చిన కేంద్రం.. మంగళవారం చర్చలు అసంపూర్ణం
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని అష్టదిగ్బంధనం చేసిన రైతుల ఆందోళనలో కొంత పురోగతి కనిపించింది. అయితే రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు..
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని అష్టదిగ్బంధనం చేసిన రైతుల ఆందోళనలో కొంత పురోగతి కనిపించింది. అయితే రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు మాత్రం మంగళవారం అసంపూర్ణంగా ముగిసాయి. ఉధృతమైన రైతుల ఆందోళనను చూసి నిర్ణయించిన తేదీ కంటే రెండ్రోజులు మందుగానే రైతు సంఘాలతో చర్చలకు దిగొచ్చిన కేంద్రం, తాము తెచ్చిన కొత్త చట్టాల గురించి వారికి వివరించే ప్రయత్నం చేసింది. అలాగే కొత్త చట్టాల్లో రైతు సంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలపై అధ్యయనం చేసేందుకు సైతం సిద్ధమని సానుకూల సంకేతాలు పంపించింది.
రైతు సంఘాలు అభ్యంతరం చెబుతున్న అంశాలను ఒక నివేదిక రూపంలో బుధవారం (డిసెంబర్ 2న) అందజేయాలని, వాటిపై డిసెంబర్ 3న జరగనున్న మరో విడత సమావేశంలో కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ చర్చలు జరిగాయి. రైతుల తరఫున 35 రైతు సంఘాల నేతలు హాజరవగా, కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.