సూడాన్లో కుప్పకూలిన కార్గో విమానం.. 17 మంది మృతి
సూడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించినట్టు స్థానిక మీడియా ప్రకటించింది. 15 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు.
సూడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించినట్టు స్థానిక మీడియా ప్రకటించింది. 15 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించామని.. అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. రాజధాని జూబా సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి శనివారం ఉదయం ఈ విమానం బయలుదేరినట్టు తెలుస్తోంది. ఎన్జీవోల కోసం డబ్బు, ఆహారం, వాహనాలు, స్పేర్ పార్ట్లను విమానం తీసుకెళ్తున్నట్టు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కుర్ కౌల్ పేర్కొన్నారు. విమానం గాల్లోకి వెళ్లిన కాసేపటికే కుప్పకూలినట్టు.. వెంటనే అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ కార్గో విమానం సౌత్ వెస్ట్ ఏవియేషన్కు చెందినదిగా తెలుస్తోంది. కాగా.. విమానం కుప్పకూలిన సమయంలో డబ్బులు మొత్తం చెల్లాచెదురుగా పడ్డాయని.. ఇదే సమయంలో చుట్టు పక్కల ప్రజలు డబ్బుల కోసం ఎగబడ్డారని కుర్ కౌల్ తెలిపారు.