ఎర్రఖిల్లాలో గులాబీ జెండా..కాంగ్రెస్ పని ఖతమేనా ?
నల్గొండ జిల్లా ఒకప్పుడు కామ్రేడ్ల ఖిల్లా… ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దిగ్గజాల కొండగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటలు. అక్కడ పోటీ అంటేనే ఇతర పార్టీల నేతలు భయపడేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కారు ఎంట్రీతో మొత్తం అక్కడ కలరే మారిపోయింది. ఇప్పుడు పోటీ అంటేనే కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితి. ఐదేళ్లలో అక్కడా ఎందుకు సీన్ మారిపోయింది? ఏడుసార్లు గెలిచిన […]
నల్గొండ జిల్లా ఒకప్పుడు కామ్రేడ్ల ఖిల్లా… ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దిగ్గజాల కొండగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటలు. అక్కడ పోటీ అంటేనే ఇతర పార్టీల నేతలు భయపడేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కారు ఎంట్రీతో మొత్తం అక్కడ కలరే మారిపోయింది. ఇప్పుడు పోటీ అంటేనే కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితి. ఐదేళ్లలో అక్కడా ఎందుకు సీన్ మారిపోయింది?
ఏడుసార్లు గెలిచిన జానారెడ్డి:
జానారెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిచయం అక్కర లేని పేరిది. నల్గొండ జిల్లా చలకుర్తి నుంచి ఆరు సార్లు.. నాగార్జునసాగర్ నుంచి రెండుసార్లు గెలిచిన చరిత్ర జానారెడ్డి సొంతం. తిరుగులేని నేతగా పేరున్న జానారెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్లోనే పోటీచేసి.. దారుణంగా ఓటమిపాలయ్యారు.
నాలుగుసార్లు గెలిచిన కోమటిరెడ్డి:
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వింటే జిల్లాతోపాటు తెలంగాణలో ఓ రెబల్ నాయకునిగా పేరుంది. అలాంటి వెంకట రెడ్డి రెగ్యులర్గా నాలుగు సార్లు గెలిచిన నల్గొండ నియోజకవర్గం 2018లో ఆయన చేజారింది.
ఐదుసార్లు గెలిచిన దామోదర్ రెడ్డి:
సూర్యాపేట సూరీడుగా పేరున్న దామోదర్ రెడ్డి నిజానికి స్థానికుడు కాకపోయినా ఆ నియోజకవర్గం నుంచి అయిదు సార్లు గెలిచారు. అయితే.. 2014లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై గెలిచిన జగదీశ్ రెడ్డి కెసీఆర్ తొలి కేబినెట్లో విద్యుత్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో మళ్ళీ వీరిద్దరే పోటీ పడితే.. దామోదర్ రెడ్డి మరోసారి ఓటమి పాలయ్యారు. దాంతో ఆయనకు సూర్యాపేటపై పట్టు పూర్తిగా పోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఉత్తమ్ కోటకు బీటలు:
పాత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. కానీ ఇప్పుడు ఆ కోట బీటలు వారింది. రాజకీయంగా ఎదురులేని నేతల నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో నల్గొండలో ఆరు సీట్లు మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు జిల్లాలో గులాబీ దళానికి పట్టు లేదు. బలమైన నాయకత్వం లేదు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి మొత్తం మారిపోయింది. రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయారు. సూర్యాపేటలో దామోదర్రెడ్డి కూడా విజయం సాధించలేకపోయారు. పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఓడిపోవడంతో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
పాత నల్గొండ జిల్లాలో 12 సీట్లకు మూడు స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వీరిలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారిపోయారు,. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటు ఉత్తమ్ సీటు హుజూర్నగర్ కూడా కాంగ్రెస్ కోల్పోయింది. దీంతో నల్గొండలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండా పోయారు. అయితే జిల్లాలో రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిచింది.
ఇప్పుడు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కేడర్ ఆధారపడాల్సిన పరిస్థితి. 1985,1994లో కూడా కాంగ్రెస్కు జిల్లాలో ఒక్క సీటూ గెలవలేదు. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తూ వస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. వచ్చే ఎన్నికల నాటికి బలపడతామనే ధీమాలో పార్టీ కేడర్ ఉంది. ఈ ధీమా నెగ్గేనా ? వారి కల నెరవేరేనా అన్నది వేచి చూడాల్సిందే.