Gold rates: అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు.. టెన్షన్ పడుతున్న వ్యాపారులు.. కారణం ఇదే..
ఇలా మన దేశంలో అధికారిక ధరల కంటే తక్కువకే వ్యాపారులు విక్రయాలు జరిపారు. గత 10 నెలల్లో గరిష్ట స్థాయికి గత వారం అమ్మకాలు జరిగాయి. గతం వారంలో ఔన్సుకు 42 డాలర్లు తక్కువకే అందించారు. అంతకుముందుకు వారంలో ఈ తగ్గింపు 24 డాలర్లుగా ఉంది.
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతూనే ఉంటున్నాయి. సామాన్య, మధ్య తరగతి వారు బంగారం అంటేనే భయపడేంతగా దూసుకెళ్తున్నాయి. ప్రజలు బంగారు కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా దేశంలో బంగారం రిటైల్ డిమాండ్ గణనీయంగా పడిపోయింది. దేశీయ అమ్మకాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. దీంతో వ్యాపారుల్లో నష్ట భయం పట్టుకుంది. చాలా మంది డీలర్లు పలు ఆఫర్లు ప్రకటించి, కొనుగోలు దారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మన దేశంలో అధికారిక ధరల కంటే తక్కువకే వ్యాపారులు విక్రయాలు జరిపారు. గతం వారంలో ఔన్సుకు 42 డాలర్లు తక్కువకే అందించారు. ఇది గత 10 నెలల్లో గరిష్ట స్థాయి. అంతకుముందుకు వారంలో ఈ తగ్గింపు 24 డాలర్లుగా ఉంది. మన దేశం బులియన్ అవసరాల కోసం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీంతో దేశీయ ధరలలో 15 శాతం దిగుమతి సుంకం, మూడు శాతం జీఎస్టీ కలిపి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో గతవారం పది గ్రాములు బంగారం ధర రూ.57,125కి చేరింది. అయితే వారం చివరికి వచ్చే సరికి రూ. 56,900 వద్ద స్థిరపడింది.
బడ్జెట్ పైనే ఆశలు..
యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో సమర్పించనున్నారు. దీనిపై బంగారం వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూలై 2022లో ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15%కి పెంచింది. దీంతో దిగుమతులు పెద్ద ఎత్తున పడిపోయాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా 2022 లో దిగుమతులు తగ్గడానికి మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. దిగుమతి సుంకం తగ్గితే చాలా వరకూ ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.
పెరుగుతూనే ఉన్న ధరలు..
2023 జనవరిలో బంగారం తన పరుగును ఆపలేదు. ఒక్క నెలలోనే దాదాపు 3-4% రేట్లు పెరిగాయి. నవంబర్ కనిష్టాలతో పోలిస్తే, ఇది దాదాపు 14% అధికం. ప్రధానంగా యూఎస్ డాలర్ బలహీనత, యూఎస్ బాండ్ ఈల్డ్లు సున్నితంగా మారండంతో పాటు పశ్చిమ దేశాలలో మాంద్యం భయం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రానురాను బంగారం ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. దేశీయంగా కూడా బంగారం ధరలు రూ. 58,000-రూ. 59,000 స్థాయిని తాకవచ్చని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మళ్లీ మునుపటి గరిష్టాలను తాకవచ్చని వివరిస్తున్నారు. 2,060 డాలర్ల నుంచి 2,100 డాలర్ల రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..